చండీగఢ్: నేరస్తులు ముందు హత్యలు చేసి ఆ తర్వాత రాజకీయాల్లోకి వస్తున్నారని హత్యకు గురైన పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్ విమర్శించారు. గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నేతగా ఎదిగిన గుర్ప్రీత్ సింగ్ సెఖోన్ను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేర్చుకోవడంపై ఆయన మండిపడ్డారు. (Sidhu Moosewala’s Father Slams AAP) నేర చరిత్ర ఉన్న వ్యక్తులకు ప్రధాన రాజకీయాల్లో చోటు కల్పిస్తున్నారని అధికార పార్టీని ఆయన తప్పుబట్టారు. మాన్సాలో జరిగిన సమావేశంలో సిద్ధూ మూసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్ మాట్లాడారు. గ్యాంగ్స్టర్లతో సంబంధం ఉన్న వ్యక్తిని పార్టీలో చేర్చుకోవాలన్న ఆప్ నిర్ణయాన్ని ఆయన ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో సుమారు 15 మంది గ్యాంగ్స్టర్లు పోటీ చేసే అవకాశం ఉందని అన్నారు.
కాగా, ఆప్లో ప్రజా సేవకులు తక్కువగా, గ్యాంగ్స్టర్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఎక్కువగా ఉన్నారని బల్కౌర్ సింగ్ ఆరోపించారు. ‘ముందు రెండు-నాలుగు హత్యలు చేయండి, ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి నేరుగా అసెంబ్లీకి వెళ్లండి’ అని ఎద్దేవా చేశారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను అసెంబ్లీకి పంపాలా లేక ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రజల హక్కుల కోసం పోరాడగలిగే నిజాయితీ గల, సమర్థులైన ప్రతినిధులను ఎన్నుకోవాలా అనేది పంజాబ్ ప్రజలే నిర్ణయించుకోవాలని బల్కౌర్ సింగ్ అన్నారు. రాజకీయాల్లో నేరపూరిత శక్తుల ప్రభావం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో 2027లో జరుగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు అత్యంత హింసాత్మకంగా మారవచ్చని ఆయన అంచనా వేశారు.
మరోవైపు 2016లో నాభా జైలు నుంచి పరారైన ఘటనలో ప్రధాన నిందితుడు, గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నేతగా ఎదిగిన గుర్ప్రీత్ సింగ్ సెఖోన్, ఆప్లో చేరడంపై వివాదం చెలరేగింది. ఆదివారం ఫిరోజ్పూర్ జిల్లాలోని జిరాలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో సీఎం భగవంత్ మాన్ సింగ్ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో త్వరలో జరుగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో జిరా స్థానం నుంచి ఆప్ తరుఫున గుర్ ప్రీత్ సింగ్ సెఖోన్ పోటీ చేయవచ్చని తెలుస్తున్నది. ఇప్పటికే ఆయన తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ప్రచారం కోసం సన్నద్ధమవుతున్నారు.