ముంబై: ఒమిక్రాన్ సబ్ వేరియంట్లైన బీఏ.4, బీఏ.5 కరోనా కేసులు దేశంలో క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని పూణేలో ఈ కొత్త కరోనా వేరియంట్ల తొలి కేసులు నమోదయ్యాయి. ఈ వేరియంట్ల కరోనా వైరస్ను తాజాగా ఏడుగురు రోగుల్లో గుర్తించారు. పూణేకు చెందిన నలుగురిలో బీఏ.4, ముగ్గురిలో బీఏ.5 వేరియంట్ ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యిందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ శనివారం తెలిపింది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని పూణే జిల్లా వైద్యాధికారులకు సూచించింది.
కాగా, ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఏ.4 తొలి కేసును ఈ నెల ఆరంభంలో హైదరాబాద్లో గుర్తించారు. కొత్త వేరియంట్లు ఉనికిలోకి వచ్చిన దక్షిణాఫిక్రా నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడికి కరోనా పరీక్ష నిర్వహించగా బీఏ.4 వేరియంట్ సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది. అనంతరం తెలంగాణతోపాటు తమిళనాడులో బీఏ.4, బీఏ.5 వేరియంట్ కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి.
మరోవైపు ఈ ఒమిక్రాన్ వేరియంట్ల కరోనా వైరస్ వల్ల పెద్దగా ముప్పులేదని వైద్య నిఫుణులు తెలిపారు. ఇది ఇప్పటికే దేశంలో వ్యాపించిందని చెప్పారు. గత ఏడాది దేశాన్ని వణికించిన డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ సబ్ వేరియంట్ల ప్రభావం చాలా తక్కువని వెల్లడించారు.