మాలే: మాల్దీవులలోని భారత సైన్యంలో దాదాపు 25 మంది సోమవారం స్వదేశానికి బయల్దేరారు. మాల్దీవులకు భారత్ బహుమతిగా ఇచ్చిన హెలికాప్టర్ కార్యకలాపాలను వీరు నిర్వహించేవారు. వీరు ఆ బాధ్యతలను ఇండియన్ పౌర సిబ్బందికి అప్పగించారు. ఈ వివరాలను మాల్దీవ్స్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్(ఎంఎన్డీఎఫ్) ప్రతినిధి చెప్పినట్లు ఆ దేశ మీడియా సోమవారం వెల్లడించింది.
అయితే భారత రక్షణ శాఖ దీనిని ధ్రువీకరించలేదు. మాల్దీవుల్లో మిగిలిన భారతీయ సైనికులు మే 10 నాటికి తిరిగి భారత్కు వెళ్లిపోతారని ఎంఎన్డీఎఫ్ ప్రతినిధి చెప్పినట్లు మాల్దీవుల మీడియా తెలిపింది. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు కూడా ఇదే విషయాన్ని గతంలో చెప్పారు. భారత దేశానికి చెందిన సైనికులు కానీ, సాధారణ అధికారులు కానీ మే 10 తర్వాత మాల్దీవుల్లో ఉండరన్నారు.