Firhad Hakim : పశ్చిమ బెంగాల్లో వరుసగా పార్టీలో తిరుగుబాట్లు ఎదుర్కొంటున్న టీఎంసీకి ఇప్పుడు మరో ఎదురుదెబ్బ తగిలింది. కోల్కతా మేయర్ పదవికి టీఎంసీ కీలక నేత ఫిర్హాద్ హకిం రాజీనామా చేశారు. అయితే, మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆమోదంతోనే ఫిర్హాద్ తన పదవికి రాజీనామా చేయడం విశేషం. ఫిర్హాద్ తన పదవికి రాజీనామా చేస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. తను కోల్కతా మేయర్ పదవి నుంచి తప్పుకోవాలనుకుంటున్న విషయాన్ని ఫిర్హాద్ ఇటీవలే మమతా బెనర్జీకి చెప్పినట్లు సమాచారం. ముందుగా ఈ నిర్ణయాన్ని మమత వ్యతిరేకించినప్పటికీ తర్వాత అంగీకరించారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. దీంతో బుధవారం ఫిర్హాద్ తన మేయర్ పదవికి రాజీనామా చేశారు. ఇక, పశ్చిమ బెంగాల్లో టీఎంసీలో సంక్షోభం కొనసాగుతోంది. ఆ పార్టీలో పదవులకు ఎంపీలు రాజీనామా చేస్తున్నారు. తాజాగా పార్టీకి ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. దాదాపు 58 మంది ఎమ్మెల్యేలు.. పార్టీలో తిరుగుబాటుకు నేతృత్వం వహిస్తున్న టీఎంసీ బహిష్కృత నేత రితబ్రతా బెనర్జీని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించాలని కోరారు.
దీనికి స్పీకర్ కూడా అంగీకరించారు. దీంతో అంతకుముందు శోభన్దేవ్ ఛట్టోపాధ్యాయ్ అసెంబ్లీలో తమ పార్టీ లీడర్ అంటూ టీఎంసీ అగ్రనేత అభిషేక్ బెనర్జీ ఇచ్చిన లేఖను పక్కనబెట్టారు. మరోవైపు టీఎంసీ తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో చాలా మంది అభిషేక్ బెనర్జీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, మమతా బెనర్జీనే నాయకురాలిగా ఉండాలని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా ప్రస్తుతం టీఎంసీకి గడ్డుకాలమే నడుస్తోంది.