న్యూఢిల్లీ : పశ్చిమ ఢిల్లీలోని ముండ్కా మెట్రోస్టేషన్ పిల్లర్ నంబర్ 544కు సమీపంలో ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ మేరకు సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ 24 ఫైర్ టెండర్లను సంఘటనా స్థలానికి తరలించి, మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. భవనంలో చాలా మంది చిక్కుకుపోగా.. అగ్నిమాపక సిబ్బంది వారిని రక్షించారు. అయితే, ఓ మహిళ మంటల్లో చిక్కుకొని మృతి చెందింది. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని భవనం కిటికీలు పగులగొట్టినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
భవనంలో ఉన్న వారిని రక్షించడంతో పాటు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. భవనాన్ని ఆఫీస్ స్థలంగా వినియోగిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీస్ అధికారి సమీర్ శర్మ తెలిపారు. సీసీ కెమెరా, రూటర్ కంపెనీ కార్యాలయం ఉన్న భవనంలోని మొదటి అంతస్తు నుంచి మంటలు చేలరేగాయి. అయితే, కంపెనీ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.