Fire in EV Maker Ather Unit | దేశవ్యాప్తంగా విద్యుత్ వాహనాలు ప్రమాదాల బారీన పడటం మీడియాలో పతాక శీర్షికలకెక్కాయి. కానీ, తాజాగా తమిళనాడు రాజధాని చెన్నైలోని ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఎథేర్ ఎనర్జీ ఎక్స్పీరియన్స్ సెంటర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. తమ కంపెనీ ప్రాంగణంలో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగిందని ఎథేర్ ట్విట్లో తెలిపింది. అగ్ని ప్రమాదం వల్ల కొంత ఆస్తి, కొన్ని స్కూటర్లు దెబ్బ తిన్నాయని వెల్లడించింది. అయితే, ఉద్యోగులంతా సురక్షితంగా ఉన్నారని పేర్కొంది.
త్వరలో ఎక్స్పీరియన్స్ సెంటర్ కార్యకలాపాలు పునఃప్రారంభం అవుతాయని శుక్రవారం అర్ధరాత్రి పొద్దు పోయిన తర్వాత వెల్లడించింది. ప్రమాద కారణాలు బయటపెట్టలేదు. స్థానిక అగ్ని మాపక దళ అధికారుల నుంచి నివేదిక కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపింది.
పలు ఈవీ తయారీ సంస్థలు తయారు చేసిన విద్యుత్ వాహనాల్లో బ్యాటరీల పేలుళ్లు, అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న వేళ.. ఆయా సంస్థల పనితీరుపై, ఆ వాహనాల నాణ్యతపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది. ఈ తరుణంలో ఎథేర్ సంస్థ ఆవరణలో ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. ఎథేర్ సంస్థలో అగ్ని ప్రమాదం జరుగడం కూడా ఇదే తొలిసారి.