న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ రెండో విడుత సమావేశాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా కేసులు అదుపులోకి రావడంతో పార్లమెంటు ఉభయసభలు యథావిధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు జరగనున్నాయి. వచ్చే నెల 8 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. కాగా, లోక్సభ కార్యకలాపాలు ప్రారంభంకాగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) 2022-23కు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జమ్ముకశ్మీర్ బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టనున్నారు. భోజన విరామం తర్వాత దానిపై చర్చ జరిగే అవకాశం ఉన్నది.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమయ్యాయి. మొదటి విడుత సమావేశాలు ఫిబ్రవరి 11న ముగిశాయి. నేటి నుంచి ఏప్రిల్ 8 వరకు సమావేశాలు జరుగుతాయి. ఈ సందర్భంగా రాజ్యాంగ (షెడ్యూల్డ్ ట్రైబ్స్) ఆదేశాల (సవరణ) బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమోద ముద్ర వేయించుకోవాలని కేంద్రప్రభుత్వం యోచిస్తున్నది.