Karnataka | బెంగళూరు, డిసెంబర్ 21: ముందుచూపు లేకుండా, ఎన్నికల సమయంలో అలివికాని హామీలిచ్చి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు వాటిని అమలు చేయలేక చేతులెత్తేస్తున్నది. సవాలక్ష కొర్రీలు విధిస్తున్నది. నిధులు సమీకరణకు నిరుద్యోగులను బలిచేస్తున్నది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షల పోస్టులను భర్తీ చేయకుండా, జీతభత్యాల సొమ్మును పథకాలకు మళ్లిస్తున్నది. దీంతో చాలావరకు ప్రభుత్వ శాఖల్లో సగానికి కంటే తక్కువ సిబ్బంది ఉన్నారు. వారిపై అధిక పనిభారం పడుతున్నది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కారు.. ఇప్పుడు మాటతప్పడంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కర్ణాటకలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 2.55 లక్షలకు పైగా గ్రూప్-ఏ, గ్రూప్-డీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా రాష్ట్రంలోని చాలా శాఖలు సగం మంది సిబ్బందితోనే పని కానిచ్చేస్తున్నాయి. దీంతో అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్లు గుట్టలుగా పేరుకుపోతున్నాయని మైసూరుకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి వెల్లడించారు. నియామకాలు ఆగిపోవటంతో ఇతర ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి పడుతున్నదని తెలిపారు. మొత్తంగా రాష్ట్రంలో 7.72 లక్షల పోస్టులు ఉండగా, ప్రస్తుతం 5.16 లక్షల మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. ఆ పోస్టులే కాదు.. ఐఏఎస్ స్థాయిలోనూ చాలా వరకు పోస్టులు ఖాళీగా ఉండటం గమనార్హం.
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరిన్ని వనరులను మళ్లించే అవకాశాలున్నాయని ఉద్యోగులు చెప్తున్నారు. కర్ణాటకలో ఎక్సైజ్ నుంచే పెద్దమొత్తంలో ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది. అయినా, ఎక్సైజ్ శాఖలో ఉద్యోగుల కొరత ఉండటంతో నాలుగు బీరు తయారీ కంపెనీల్లో మూడో షిఫ్ట్ను ఆపేశారు. కొన్ని వర్గాల నుంచి ఒత్తిడులు రావటంతో మూడో షిఫ్ట్ను మళ్లీ పునరుద్ధరించారు.