న్యూఢిల్లీ, జనవరి 7: కార్గిల్ పర్వతాల్లో అత్యంత ఎత్తయిన ప్రదేశాల్లో ఓ యుద్ధ విమానాన్ని దింపటమంటే మామూలు విషయం కాదు. మొదటిసారి రాత్రి సమయంలో సి-130జే విమానాన్ని కార్గిల్ ఎయిర్స్ట్రిప్పై (తాత్కాలిక రన్ వే) విజయవంతంగా ల్యాండింగ్ చేశామని భారత వాయుసేన ఆదివారం అధికారికంగా వెల్లడించింది. సరిహద్దులో పాక్ నియంత్రణ రేఖకు సమీపంలో అత్యంత ఎత్తయిన ప్రదేశంలో ఈ విన్యాసం నిర్వహించామని తెలిపింది. టెరైన్ మాస్కింగ్ ఉపయోగించి, గరుడ కమాండోల శిక్షణలో భాగంగా ఈ ఆపరేషన్ జరిపామని ‘ఎక్స్’లో భారత వాయుసేన ప్రకటించింది.
కార్గిల్ ఎయిర్స్ట్రిప్ సముద్రమట్టానికి 10,500 అడుగుల ఎత్తులో ఉంది. సరిహద్దులో వాస్తవాధీన రేఖ వెంబడి పలు వైమానిక కేంద్రాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై రక్షణశాఖ దృష్టిసారించింది. సైనిక బలగాలు, యంత్రాలు, పరికరాలు.. ఇతర సామగ్రిని తరలించేందుకు ఈ కేంద్రాలు అత్యంత కీలకంగా మారుతాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా అక్కడికి చేరుకునేలా యుద్ధ విమానాల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక ఆపరేషన్లు వాయుసేన చేపట్టింది.