భోపాల్ : కొవిడ్-19 సోకిందనే అనుమానంతో వైరస్ తగ్గుతుందని కిరోసిన్ తాగడంతో ఓ వ్యక్తి మరణించిన ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో వెలుగుచూసింది. మహేంద్ర (30)గా గుర్తించిన బాధితుడు జ్వరంగా ఉండటంతో కరోనాగా భావించి చికిత్సగా కిరోసిన్ ను తాగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. మహేంద్రకు నిర్వహించిన కరోనా టెస్టులో తర్వాత నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది.
టైలర్ పనిచేసే మహేంద్ర భోపాల్ లోని శివనగర్ లో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఐదారు రోజులుగా మందులు వాడుతున్నా జ్వరం తగ్గకపోవడంతో కరోనా వచ్చిందని మహీంద్ర అనుమానించాడు. కిరోసిన్ వైరస్ ను చంపుతుందని ఎవరో చెప్పగా బుధవారం రాత్రి కిరోసిన్ తాగాడు. అతడి పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు సమీప ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మహేంద్ర మరణించాడని వైద్యులు తెలిపారు.