న్యూఢిల్లీ: ఫెర్టిలైజర్ల ధరలు అనూహ్య రీతిలో పెరిగినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) అన్నారు. ఫ్యూయల్, ఫెర్టిలైజర్, ఫోరెక్స్.. ఈ మూడింటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆమె సూచించారు. పశ్చిమాసియాలోని ఉద్రిక్త పరిస్థితుల వల్ల. ప్రపంచ మార్కెట్లు కుదేలవుతున్నాయని, దేశంలో అన్నింటిపై వ్యయం పెరిగినట్లు ఆమె చెప్పారు. ముంబైలో జరిగిన స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన 37వ వార్సికోత్సం కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవాలని ఇటీవల ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును ఆమె గుర్తు చేశారు. అది చాలా ముఖ్యమైందని, మూడు ఎఫ్లపై ఫోకస్ చేయాలని, ఫ్యూయల్.. ఫెర్టిలైజర్, ఫోరెక్స్ పై దృష్టి పెట్టాలని ఆమె అన్నారు. గడిచిన 10 రోజుల్లోనే నాలుగు సార్లు ఇంధనం ధరలు పెరిగాయి. ముడి చమురు ధర పెరగడం పెద్ద సవాల్గా మారిందన్నారు. ఇంధనంతో పాటు ఫెర్టిలైజర్ల ధర అమాంతంగా పెరిగినట్లు ఆమె తెలిపారు. వీటితో పాటు పెరిగిన బంగారం ధరలు కూడా కొన్ని సవాళ్లను సృష్టిస్తున్నట్లు ఆమె అన్నారు.
పశ్చిమాసియా సంక్షోభం ఓ దౌత్యపరమైన లేక రాజకీయపరమైన సమస్య కాదు అని మంత్రి తెలిపారు. ఆ సంక్షోభం వల్ల వ్యాపారవేత్తలు, సాధారణ ప్రజలు ఇబ్బందిపడుతున్నట్లు చెప్పారు. ఇంధన ధరలు పెరిగాయని, కార్గో ఆలస్యం అవుతోందని, షిప్పింగ్ ఖర్చు పెరిగిందని, ఇన్పుట్స్ తగ్గాయని, పెట్టుబడిపై వత్తిడి పెరిగిందని, ఎగుమతి ఆదేశాలపై అనిశ్చితి నెలకొన్నట్లు మంత్రి తెలిపారు. అన్ని ఒకేసారి జరగడం వల్ల ఆ ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు ఆమె చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ప్రస్తుతం పాజిటివ్ ఉందని ఆమె అన్నారు. కానీ కొందరు ఎప్పుడూ నెగటివ్గా మాట్లాడుతారని విమర్శించారు. తమ ప్రభుత్వం సాధించిన ఘనతలను హేళన చేస్తున్నారన్నారు. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని, సుమారు లక్ష కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు మంత్రి సీతారామన్ తెలిపారు.