న్యూఢిల్లీ, జూలై 18: కేరళలో కొల్లాం జిల్లాలోని ఓ నీట్ పరీక్షా కేంద్రంలో విద్యార్థినులకు అవమానం జరిగింది. పరీక్షా కేంద్రంలోకి వెళ్లే ముందు చెకింగ్ ప్రక్రియలో భాగంగా సిబ్బంది దాదాపు 100 మంది మహిళా అభ్యర్థుల లోదుస్తులను(బ్రా) తీసివేయించారు. బ్రా తీసివేయాలని లేకుంటే పరీక్ష రాయనివ్వమంటూ హెచ్చరించారు. దీనిపై బాధిత విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భవిష్యత్తుకు కీలకమైన పరీక్ష రాసేముందు సిబ్బంది తమను మానసికంగా వేధించారని విద్యార్థినులు పేర్కొన్నారు. ఈ అభ్యంతర, అవమానకర ఘటన కొల్లాం జిల్లాలోని మర్తోమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరీక్ష కేంద్రంలో ఆదివారం చోటుచేసుకున్నది. ఎన్టీఏ మార్గదర్శకాల్లోని డ్రెస్కోడ్ ప్రకారం.. లోహపు(మెటల్) వస్తువులు ధరించి వస్తే ఎగ్జామ్ హాల్లోకి అనుమతించరు. ఈ రూల్ లోదుస్తులకు వర్తించదు.