కొత్తగూడెం ప్రగతి మైదాన్, ఏప్రిల్ 13 : ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మహిళా మావోయిస్టు కమాండర్ మృతిచెందారు. మాచ్పల్లి, ఆరమ్ఝార్ హిదూర్ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు ఉన్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో వారికి మావోయిస్టులు తారసపడి జవాన్లపై కాల్పులు జరిపారు.
ఇరువర్గాల మధ్య భీకరపోరు జరిగినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతిచెందింది. మృతురాలు మావోయిస్టు పార్టీ ప్రతాప్పూర్ ఏరియా కమిటీ సభ్యురాలు, కమాండర్ రూపీగా గుర్తించినట్లు కాంకేర్ జిల్లా ఎస్పీ నిఖిల్ అశోక్ కాఖేచ తెలిపారు. రూపీ తెలంగాణ ప్రాంతానికి చెందిన మహిళగా, ఆమె తెలుగు రాష్ర్టాల నుంచి బస్తర్ రేంజ్ పరిధిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న చివరి కార్యకర్తగా ప్రకటించారు.