న్యూఢిల్లీ: అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఎదుగుతున్న, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పేరున్న భారత్లో ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య తగ్గుతున్నది. శ్రామిక శక్తిలో స్త్రీల భాగస్వామ్యం తక్కువగా ఉన్న 20 దేశాల జాబితాలో ఇండియా ఉండటమే ఇందుకు నిదర్శనం. కుటుంబ బాధ్యతలు, పిల్లల పెంపకం, సామాజిక ఒత్తిడి, తక్కువ వేతనాలు, ఉద్యోగాల కొరత వల్ల పని చేసే మహిళల సంఖ్య తగ్గిపోతున్నది.
2004లో మహిళల ఉద్యోగిత రేటు 35 శాతం ఉంటే, 2022 నాటికి అది 25 శాతానికి పడిపోయినట్టు ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నాయి. అయితే రోజులో ఒక గంట సేపు ఉద్యోగం చేసిన మహిళలను కూడా ఇందులో లెక్కించారు.
సెంటర్ ఫర్ మానిటరింగ్ ది ఇండియన్ ఎకానమీ అంచనా ప్రకారం 2022లో దేశ శ్రామిక శక్తిలో మహిళల సంఖ్య 3.9 కోట్లు కాగా, పురుషుల సంఖ్య 36.1 కోట్లుగా ఉన్నది. ఉద్యోగాలు చేసే విషయంలో గ్రామీణ మహిళలతో పోలిస్తే పట్టణ ప్రాంత మహిళల పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నది. మూడు దశాబ్దాలుగా చదువుకొనే మహిళల సంఖ్య పెరుగుతున్నా, కొన్ని ఉద్యోగాలు అందుబాటులో ఉన్నప్పటికీ సామాజిక ఒత్తిడి వారిని ఉద్యోగాలు చేయనీయడం లేదు.