న్యూఢిల్లీ : కొవిడ్ నుంచి ప్రపంచ దేశాలు కోలుకుంటున్నాయి. కేసులు తగ్గుతున్న నేపథ్యం ఆంక్షల సడలింపులు ప్రకటిస్తున్న నేపథ్యంలో మరోసారి మహమ్మారి రూపం మార్చుకొని వచ్చి అందరినీ కలవరానికి గురి చేస్తున్నది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’తో సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వేరియంట్ డెల్టా కంటే ప్రమాదకరమైందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డెల్టా వేరియంట్లో రెండు ఉత్పరివర్తనాలు (మ్యుటేషన్స్) గుర్తించగా.. ఒమిక్రాన్ వేరియంట్లో 30కిపైగా నమోదు చేశారు. ఇప్పటికే పలు కేసులు నమోదగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’గా పేర్కొన్నది.
రెండు రోజుల్లోనే రెట్టింపు దేశాలకు..
ఒమిక్రాన్ వేరియంట్ను ఇప్పటికే దాదాపు డజను వరకు దేశాలకు పాకింది. దక్షిణాఫ్రికాలో ఈ నెల 24న వేరియంట్ గుర్తించి ప్రకటించగా.. 26వ తేదీ నాటికి ఐదు దేశాలకు విస్తరించింది. ఆదివారం నాటికి 11 దేశాల్లో కొత్త వేరియంట్ కేసులు రికార్డయ్యాయి. అయితే మరో డజన్కుపైగా దేశాలకు మహమ్మారి విస్తరించిందని, క్రమంగా కేసులు తెరపైకి వస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఒమిక్రాన్ విధ్వంసం త్వరలోనే ఇతర దేశాల్లో కనిపిస్తుందని హెచ్చరిస్తున్నారు.
బోట్స్వానాలోనేనా..?
కరోనా కొత్త వేరియంట్ కేసులు ఇప్పటి వరకు ఆఫ్రికా నుంచి యూరప్ వరకు ఉన్న పలు దేశాల్లో నమోదయ్యాయి. ఈ వేరియంట్ బోట్స్వానాలో ఉద్భవించిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, తొలి కేసును గుర్తించింది మాత్రం దక్షిణాఫ్రికాలోనే కాగా.. కొత్త వైరస్ కేసులు యూకే, బెల్జియం, జర్మనీ, ఇజ్రాయెల్, చెక్ రిపబ్లిక్, ఇటలీ, హాంకాంగ్, ఆస్ట్రేలియాలో రికార్డయ్యాయి. యూకే నుంచి ఇద్దరు నెదర్లాండ్కు చేరగా.. వైరస్ పాజిటివ్గా తేలింది. ‘ఒమిక్రాన్’ వేరియంటేనా? కాదా? అన్న విషయం తేలాల్సి ఉన్నది. కొత్త కేసుల నేపథ్యంలో పలు దేశాలు మళ్లీ ఆంక్షల బాటపడుతున్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, సౌదీ సహా పలు దేశాలు ఆఫ్రికా, యూరప్ దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించాయి.
భారత్లో వ్యాప్తి చెందే ప్రమాదం ఎంత?
కరోనా మహమ్మారి నేపథ్యంలో 2020, మార్చిలో భారత్ అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం ఎత్తివేసింది. లాక్డౌన్, కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ‘ఎయిర్బబుల్’ కింద పలు దేశాలతో ఒప్పందం చేసుకున్నది. ముందు జాగ్రత్తలను పాటిస్తూ విమాన సర్వీసులను నడిపింది. ప్రస్తుతం భారత్ ఎయిర్బబుల్ స్కీం కింద 31 దేశాలతో ఒప్పందం చేసుకున్నది. ఆయా దేశాల ప్రజలు భారత్కు వచ్చి వెళ్లొచ్చు. ప్రస్తుతం ఒమిక్రాన్ గుర్తించిన మూడు దేశాలతో ఒప్పందాలున్నాయి. ఇందులో జర్మనీ, బ్రిటన్, నెదర్లాండ్ ఉన్నాయి. ఈ క్రమంలో ఈ మూడు దేశాల నుంచి వచ్చే విమానాలపై ప్రత్యేకంగా అధికారులు దృష్టి సారిస్తున్నారు.
విమాన సర్వీసులపై పునరాలోచన!
ఇటీవల కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 15 నుంచి అన్ని దేశాలకు విమాన సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించిన విషయం విధితమే. అయితే, కరోనాపై ఉన్నత స్థాయి సమావేశం తర్వాత ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కరోనా కొత్త వేరియంట్ను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు నియంత్రణ, నిఘా పెంచాలని సూచించారు. అలాగే టీకాల పంపిణీని వేగవంతం చేయాలని ఆదేశించారు.