BRS Public Meeting | (స్పెషల్టాస్క్ బ్యూరో) కంధార్ లోహా, మార్చి 24 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ గత నెలలో నిర్వహించిన నాందేడ్ సభతో మహారాష్ట్ర సర్కారు భయపడిపోయిందని మరాఠీ రైతులు పేర్కొన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్లో ఫిబ్రవరి 5న చేరికల సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఆదివారం నాందేడ్ జిల్లాలోని కంధార్-లోహాలో బీఆర్ఎస్ రెండో బహిరంగ సభను నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధి బృందం వివిధ గ్రామాల్లో పర్యటించింది. నిజామాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతం డెగులూర్ మీదుగా కంధార్-లోహా చేరుకొన్నది. మార్గమధ్యలో పలు గ్రామాల్లో ప్రజలను పలుకరించింది. బీఆర్ఎస్ సభ గురించి ప్రస్తావన తేగానే, చాలామంది రైతులు, ప్రజలు కేసీఆర్ రాకతో తమ ప్రభుత్వానికి భయంపట్టుకొన్నదని సమాధానం ఇచ్చారు. నాందేడ్ సభ తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం రైతులపై ఎక్కడాలేని ప్రేమ ఒలకబోస్తున్నదని పాలా గ్రామానికి చెందిన రైతు జీఎం పంచాల్ తెలిపాడు. బడ్జెట్లో రైతుబంధులాంటి పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పాడు. పంట బీమా రుసుము ఎకరానికి ఒక్క రూపాయికి తగ్గించిందని పేర్కొన్నాడు. కేసీఆర్ మహారాష్ట్రలో అడుగుపెట్టడంతో తమకు మంచిరోజులు వచ్చినట్టు అనిపిస్తున్నదని పేర్కొన్నాడు.
నిజామాబాద్ నుంచి మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో చాలా దూరం ఎలాంటి సాగునీటి వసతులు లేక పొలాలన్నీ ఎండిపోయి కనిపించాయి. కంధార్, లోహా, లాతూర్, నయాగావ్, ముద్ఖేడ్ గ్రామాల చుట్టుపక్కల వ్యవసాయ భూములకు సాగునీరే అందడం లేదు. రైతులు వర్షాధార పంటలు మాత్రమే పండిస్తున్నారు. ముక్రమాబాద్ మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు 25 ఏండ్లయినా పూర్తి కాలేదని రైతు జీఎం పంచాల్ తెలిపాడు. కేసీఆర్ నాందేడ్ సభ తర్వాత అన్ని పార్టీల నాయకులు రైతుల వద్దకు వచ్చి మాట్లాడుతున్నారని తెలిపాడు.
నాందేడ్ ప్రజలు తెలంగాణ సంక్షేమ పథకాలపై మక్కువ చూపుతున్నారు. రైతు బంధు, రైతు బీమా, సాగునీరు, ఉచిత విద్యుత్తులాంటి పథకాలుంటే రైతులకు కావాల్సిందేంటని అంటున్నారు. పలు కూడళ్లలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలు, ప్రచార రథాలపై ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాల గురించి ఆసక్తిగా తెలుసుకొంటున్నారు.
కంధార్ నుంచి ముద్ఖేడ్కు వెళ్లే రోడ్డు అస్తవ్యస్తంగా ఉంది. రెండు తాలుకా కేంద్రాలకు రోజు వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ఈ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వర్షాకాలంలో రోడ్డంతా బురదమయంగా మారి రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఇక్కడ రోడ్ల గురించి ఎవరూ పట్టించుకోరు. తెలంగాణలో మాకు చుట్టాలు ఉన్నారు. వారి దగ్గరికి వచ్చినప్పుడు మాకు ఎక్కడ చూసినా బీటీ రోడ్లు కనిపించాయి. కేసీఆర్లాంటి సీఎం ఉంటే ఇలాంటి సమస్యలు ఉండవు.
– ఖలీల్, ఆటోడ్రైవర్, కంధార్, నాందేడ్ (మహారాష్ట్ర)