ఉత్తరాఖండ్.. సైనిక కుటుంబాల కొండ. ఇక్కడి నుంచి సగటున ప్రతి నాలుగు ఇండ్లకో సైనికుడు భారత సైన్యంలో ఉంటాడు. దివంగత, మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) బిపిన్ రావత్ది కూడా ఈ రాష్ట్రమే. ఇప్పుడు ఆ కుటుంబాలపైనే ఆ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. రిటైర్డ్ సైనికులు, సర్వీస్ ఉన్నవారు, వారి కుటుంబాలు ఎవరికి ఓటేస్తే వారే అధికార పీఠాన్ని దక్కించుకొనే అవకాశాలున్నాయి.
ఉత్తరాఖండ్లోని మొత్తం ఓట్లలో 12 శాతం ఓట్లు ‘ఫౌజీ’ (జవాన్) కుటుంబాలకు చెందినవే. రాష్ర్టానికి సంబంధించి సైనిక విధుల్లో ఉన్నవారి ఓట్లు 93,964 ఉండగా, మాజీ సైనికులు, వారి కుటుంబాల ఓట్లు 10-12 లక్షల వరకు ఉంటాయి. రాష్ట్రంలో మొత్తం 70 సీట్లు ఉండగా, అందులో 34 నియోజకవర్గాల్లో వీరి ప్రభావం ఉండనున్నది. అందుకే, వీరి మద్దతు కూడగట్టుకోవటానికి అధికార పార్టీ బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ఆద్మీపార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. జాతీయవాదం పేరుతో బీజేపీ, సైనికుల ఫొటోలతో కాంగ్రెస్, సైనికులను బరిలో నిలిపి ఆప్.. సైనిక కుటుంబాల ఓట్లను దక్కించుకొనేందుకు శాయశక్తులా కృషిచేస్తున్నాయి.
బీజేపీ.. సైన్యధామ్
ఈ నెల 14న జరుగనున్న ఎన్నికల కోసం బీజేపీ.. జవాన్ల కోసం తీసుకొచ్చిన వన్ ర్యాంక్ వన్ పెన్షన్(ఓఆర్ఓపీ), తొలి సీడీఎస్గా బిపిన్ రావత్ నియామకాన్ని, ఉగ్రవాదులపై చేసిన సర్జికల్ స్ట్రైక్స్ అంశాలను హైలైట్ చేస్తున్నది. ముఖ్యంగా కేంద్ర రక్షణ సహాయ మంత్రిగా ఈ రాష్ర్టానికి చెందిన ఎంపీ అజయ్ భట్ ఉన్నారన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నది. అమర సైనికులను స్మరించుకొనేలా డెహ్రాడూన్లో ‘సైన్యధామ్’ను నిర్మిస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగానే 1,734 అమర సైనిక కుటుంబాల ఇంటి నుంచి మట్టిని సేకరించింది. గత డిసెంబర్ 15న కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ శంకుస్థాపన కూడా చేశారు.
ఆప్..కోటి పరిహారం
ఆప్ విషయానికి వస్తే.. మాజీ సైనికాధికారి, కర్నల్(రిటైర్డ్) అజయ్ కొతియాల్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ఈయన 2013 వరదలప్పుడు కేధార్నాథ్ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ఆప్ అధికారంలోకి వస్తే విధి నిర్వహణలో వీరమరణం పొందిన సైనిక కుటుంబాలకు ‘సమ్మాన్ రాశి(గౌరవసూచక నగదు)’ కింద రూ.కోటి అందజేస్తామని ప్రకటించింది.
కాంగ్రెస్..ప్రైడ్ ఆఫ్ ఉత్తరాఖండ్
కాంగ్రెస్ కూడా డెహ్రాడూన్లో సైనిక్ సమ్మాన్ ర్యాలీ నిర్వహించింది. దీనికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. ‘ప్రైడ్ ఆఫ్ ఉత్తరాఖండ్’ పేరుతో బిపిన్ రావత్, జనరల్(రిటైర్డ్) బీసీ జోషి, అమర సైనికుల ఫొటోలను పార్టీ కార్యాలయాల ముందు ఏర్పాటు చేయాలని పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ నేత, మాజీ సీఎం హరీశ్ రావత్ పిలుపునిచ్చారు. అధికారంలోకి వస్తే మాజీ సైనికుల సంక్షేమ మండలిని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చింది. అంతత0తేకాదు.. ఆర్మీ, సీపీఎమ్ఎఫ్ నుంచి రిటైర్ అయిన ముగ్గురు మాజీ సైనికులు సురేంద్రసింగ్ నెగీ, రంజిత్ రావత్, జాట్సింగ్ బిస్త్కు టికెట్ కూడా ఇచ్చింది.