లక్నో: సూట్కేస్లో యువతి శవం మిస్టరీ వీడింది. ఆమెను తండ్రే గన్తో కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. గత శుక్రవారం ఉత్తరప్రదేశ్ మథురలోని యమునా ఎక్స్ప్రెస్ వే సమీపంలో ఎర్ర రంగులో ఉన్న లగేజ్ ట్రాలీ బ్యాగ్ను కూలీలు గుర్తించారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దానిని తెరిచి చూసిన పోలీసులు షాకయ్యారు. ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఉన్న యువతి మృతదేహం అందులో ఉంది. ఆమె ముఖంపై రక్తంతోపాటు శరీరంపై పలు చోట్ల గాయాలున్నాయి. దీంతో మృతురాలు ఎవరన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. మొబైల్ ఫోన్లను ట్రేస్ చేశారు. ఆ యువతిని గుర్తించాలంటూ ఢిల్లీలో పోస్టర్లు అంటించారు. సోషల్ మీడియాను కూడా వినియోగించారు.
కాగా, ఆదివారం ఉదయం పోలీసులకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. దీంతో హత్యకు గురైన యువతిని 22 ఏళ్ల ఆయూషీ యాదవ్గా పోలీసులు గుర్తించారు. ఆమె తల్లి, సోదరుడికి ఫొటోలు పంపగా వారు ఆమెను గుర్తించారు. ఈ నేపథ్యంలో దక్షిణ ఢిల్లీలోని బదర్పూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న నితీష్ యాదవ్ తన కుమార్తె మృతదేహాన్ని గుర్తించేందుకు మథురకు వచ్చాడు.
ఈ సందర్భంగా పోలీసులు అతడ్ని ప్రశ్నించారు. కుటుంబానికి వ్యతిరేకంగా మరో కులం వ్యక్తిని కుమార్తె పెళ్లి చేసుకోవడం, రాత్రి వేళ ఆలస్యంగా ఇంటికి వస్తున్న ఆమె తీరు నచ్చకపోవడంపై ఆగ్రహం చెందినట్లు తెలిపాడు. ఈ నేపథ్యంలో తన లైసెన్స్ రివాల్వర్తో కుమార్తెను కాల్చి చంపినట్లు తండ్రి ఒప్పుకున్నాడు. అనంతరం మృతదేహాన్ని సూట్కేస్లో ఉంచి మథురలోని యమునా ఎక్స్ప్రెస్ హైవే సమీపంలో పడేసినట్లు చెప్పాడు.
మరోవైపు ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్లోని బలూనీకి చెందిన నిందితుడు నితీష్ యాదవ్కు ఢిల్లీలో ఉద్యోగం రావడంతో అతడి కుటుంబం అక్కడ నివాసం ఉంటున్నదని పోలీసులు తెలిపారు. కుటుంబానికి తెలియకుండా వేరే కులానికి చెందిన ఛత్రపాల్ అనే యువకుడ్ని ఆ యువతి పెళ్లి చేసుకున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో కుమార్తెను తండ్రి హత్య చేసిన సంగతి ఆమె తల్లి, సోదరుడికి కూడా తెలుసని అన్నారు. కుమార్తెను కాల్చి చంపిన తండ్రి నితీష్ యాదవ్తోపాటు ఆమె మృతదేహం పడేసేందుకు సహకరించిన తల్లి బ్రజ్బాలాను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.