జైపూర్: దేశంలోని అగ్రశ్రేణి ఇంజినీరింగ్, వైద్య కళాశాలల్లో ప్రవేశం, ఉన్నత ఉద్యోగాలకు నిర్వహించే పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ప్రముఖ కోచింగ్ హబ్ అయిన రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి మరణించాడు. తండ్రి కలిసి వెళ్లిన తర్వాత అతడు ఆత్మహత్య (student suicide) చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్కు చెందిన 17 ఏండ్ల మనీష్ ప్రజాపతి, నాలుగు నెలల కిందట కోటాకు వచ్చాడు. ఐఐటీ జేఈఈ కోసం శిక్షణ పొందుతున్నాడు. అయితే చదువులో అంతగా రాణించడం లేదు. ఈ నేపథ్యంలో మనీష్ తండ్రి గురువారం ఉత్తరప్రదేశ్ నుంచి కోటాకు వచ్చాడు. హాస్టల్లో ఉంటున్న కుమారుడ్ని కలిశాడు. ఆ సాయంత్రం సొంతూరుకు తిరుగు ప్రయాణమయ్యాడు.
కాగా, ఉత్తరప్రదేశ్కు తిరిగి వెళ్తున్న మనీష్ తండ్రి గురువారం సాయంత్రం 8 గంటలకు తన కుమారుడికి ఫోన్ చేశాడు. మనీష్ ఫోన్ ఎత్తకపోవడంతో హాస్టల్ కేర్టేకర్ రాకేష్కు కాల్ చేశాడు. దీంతో అతడు మనీష్ రూమ్కు వెళ్లి చూశాడు. ఫ్యాన్కు ఉరి వేసుకుని వేలాడుతున్న మనీష్ను చూసి షాకయ్యాడు. ఈ విషయాన్ని మనీష్ తండ్రికి చెప్పాడు. దీంతో ఆయన తిరిగి కోటాకు బయలుదేరాడు.
మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు ఆ హాస్టల్కు చేరుకున్నారు. పోస్ట్మార్టం కోసం మనీష్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. అయితే మనీష్ గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని చెప్పారు.
కాగా, చదువు ఒత్తిడి వల్ల కోటాలో ఈ వారం ముగ్గురు విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. ఈ ఏడాదిలో తాజా సంఘటన 19వ కేసు. 2022లో 15 మంది, 2021లో 9 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.