న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తాగిన మైకంలో భార్యతో గొడవపడ్డాడు. గొడవ ముదరడంతో పసిబిడ్డ కాళ్లుపట్టి గోడకు కొట్టిచంపేశాడు. అవుటర్ ఢిల్లీలోని భైస్వా డెయిరీ ఏరియాలో ఈ నెల 3న అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రవి రాయ్ (26) తన భార్య, మూడు నెలల కొడుకుతో కలిసి భైస్వా డెయిరీ ఏరియాలో నివాసం ఉంటున్నాడు. అయితే, రోజూ పూటుగా మద్యం సేవించి వచ్చి భార్యతో గొడవపడటం అతనికి అలవాటుగా మారింది.
ఈ క్రమంలో ఈ నెల 3న రాత్రి కూడా రవి రాయ్ తన భార్యతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగిపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన రవి రాయ్.. మంచంలో పడుకోబెట్టిన మూడు నెలల కొడుకు కాళ్లను చేతబట్టుకుని తలను గోడకు విసిరికొట్టాడు. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా ప్రాంతానికి వెళ్లిన పోలీసులు మద్యం మత్తులో ఉన్న రవిరాయ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.