శ్రీనగర్: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) తెలిపారు. అయితే తన కుమారుడు ఒమర్ అబ్దుల్లా ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు. జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించిన తర్వాత మాత్రమే ఎన్నికల్లో ఒమర్ పోటీ చేస్తారని అన్నారు. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఈసీ శుక్రవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో శ్రీనగర్లో మీడియాతో ఫరూక్ అబ్దుల్లా మాట్లాడారు. ‘ఈ ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నా. ఒమర్ అబ్దుల్లా పోటీ చేయడం లేదు. రాష్ట్ర హోదా రాగానే నేను తప్పుకుంటా. ఆ స్థానం నుంచి ఒమర్ అబ్దుల్లా పోటీ చేస్తారు’ అని అన్నారు.
కాగా, పదేళ్ల తర్వాత, కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడిన జమ్ముకశ్మీర్లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈసీ ముందుకు రావడాన్ని ఒమర్ అబ్దుల్లా స్వాగతించారు. గతంలో ఎప్పుడూ కూడా ఇంత ఆలస్యం జరుగలేదని తెలిపారు. జమ్ముకశ్మీర్ ప్రజలు చాలా కాలంగా ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. జమ్ముకశ్మీర్లో సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 4న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.