శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదం అంతమైందంటూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా విర్శమలు గుప్పించారు. బీజేపీ చెబుతున్నట్టుగా జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదం ఇంకా అంతం కాలేదని అన్నారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా కూకటివేళ్లతో నిర్మూలించడానికి అవసరమైన మూల కారణాలను గుర్తించాలన్నారు. ఆదివారం జరిగిన ఓ పుస్తకావిష్కరణ సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేంద్రం చెబుతున్నట్టుగా ఇక్కడ ఇంకా శాంతి నెలకొనలేదని, ఉగ్రవాద సమస్య సజీవంగానే ఉందని అబ్దుల్లా చెప్పారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదం అంతమైనట్లు కేంద్రం ప్రచారం చేస్తున్నదని ఆయన మండిపడ్డారు. వాస్తవ పరిస్థితులు ఇక్కడ అందుకు భిన్నంగా ఉన్నాయన్నారు. ఉత్తర కశ్మీర్లోని బారాముల్లాలో ఉగ్రవాదుల దాడుల్లో మాజీ పోలీస్ అధికారి మొహమ్మద్ షఫీ మరణంపట్ల తాను తీవ్రంగా చింతిస్తునట్లు తెలిపారు.
జమ్ముకశ్మీర్లో శాంతి నెలకొందని చెబుతున్న కేంద్రం ఇప్పుడు ఈ ఘటనపై ఎందుకు మౌనంగా ఉందని మండిపడ్డారు. ఉగ్రవాదం విషయంలో కేంద్రం కేవలం గాయాలకు మందు రాస్తున్నదని, దాని మూల కారణాన్ని గుర్తించడం లేదని విమర్శించారు. కశ్మీర్లో రక్తపాతాన్ని అంతం చేడానికి కేంద్రం సరైన చర్యలు తీసుకోవాలన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయకుండా కశ్మీర్లో శాంతి గురించి, పర్యాటకం గురించి మాట్లాడటం సరికాదని విమర్శించారు.