న్యూఢిల్లీ, నవంబర్ 22: గోధుమలు, నూకలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులపై ఉన్న ఎగుమతుల నిషేధాన్ని ఎత్తివేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. 2023-24 బడ్జెట్ రూపకల్పనలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రైతు నేతలతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ ‘గోధుమలు, నూకలపై ఎగుమతి ఆంక్షలు ఉండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నిషేధాన్ని ఎత్తివేయాలి. ఇదే సమయంలో వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై ఆంక్షలు విధించాలి’ అని సూచించారు. వంటనూనెల దిగుమతిపై ఆధారపడకుండా దేశీయంగా సోయాబీన్, సన్ఫ్లవర్, వేరుశెనగ ఉత్పత్తిని పెంచేలా దృష్టిసారించాలని కోరారు.