న్యూఢిల్లీ, మే 7 (నమస్తే తెలంగాణ): డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ను వెంటనే అరెస్టు చేయాలని, ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ గత రెండు వారాలుగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు మద్దతు పెరుగుతున్నది. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం), పలు మహిళా సంఘాల నేతలు రెజ్లర్లు ఆదివారం నిర్వహించిన ఖాప్ పంచాయత్ ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు. ఇందులో భాగంగా పోలీసులు సృష్టించిన అడ్డంకులను దాటుకొని పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దకు చేరుకొన్న వేలాదిగా రైతు, ఖాప్ పంచాయత్ నేతలు రెజ్లర్లకు మద్దతు ప్రకటించారు. ఖాప్ పంచాయత్ నేతలు కేంద్ర ప్రభుత్వానికి 15 రోజుల డెడ్లైన్ విధించారు. రెజ్లర్ల ఆందోళనకు స్పందించి.. ఈ నెల 21లోగా బ్రిజ్ భూషణ్ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని, ఆయన్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఖాప్ పంచాయత్ అధ్యక్షుడు పాలం చౌదరి సురేందర్ సోలంకి మాట్లాడుతూ మహిళా రెజ్లర్లకు న్యాయం జరిగే వరకు నిరసన కొనసాగుతుందన్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ రెజ్లర్లు ఆదివారం రాత్రి ఏడు గంటలకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
రెజ్లర్ల ఆందోళనపై మౌనం వహిస్తున్న కేంద్రంపై రైతు నేత రాకేశ్ టికాయిత్ మండిపడ్డారు. బ్రిజ్ భూషణ్ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నిరంకుశంగా వ్యవహరిస్తున్న మోదీ సర్కార్ను భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉన్నదని టికాయిత్ అన్నారు. రెజ్లర్లను కలిసిన వారిలో ఎస్కేఎం నేతలు రాకేశ్ టికాయిత్, దర్శన్పాల్, హనన్మొల్లా, జోగేంద్రసింగ్ ఉగ్రహాన్, అరబ్సింగ్ తదితరులు ఉన్నారు. రెజ్లర్ల పోరాటానికి మద్దతుగా ఎస్కేఎం దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిస్తూ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 11 నుంచి 18 వరకు రాష్ర్టాల రాజధానులు, జిల్లా కేంద్రాలు, తాలూకా స్థాయిల్లో సభలు, ర్యాలీలు నిర్వహిస్తామని వెల్లడించింది.
రెజ్లర్ల ఆందోళనకు మద్దతుగా నాలుగు వామపక్ష మహిళా సంఘాలు దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చాయి. బ్రిజ్ భూషణ్పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఐద్వా, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ, ఏఐఎంఎస్ఎస్, ఏఐఏఎంఎస్ డిమాండ్ చేశాయి. పట్టణాలు, గ్రామాల్లో మహిళలతో సమావేశాలు నిర్వహిస్తామని, లక్షల మంది మహిళల సంతకాలు సేకరించి, జిల్లా కలెక్టర్ల ద్వారా వాటిని ప్రధాని మోదీకి పంపుతామని తెలిపాయి.
రెజ్లర్ల ఆందోళనకు రైతు సంఘాలు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భద్రతను పెంచారు. జంతర్మంతర్తో పాటు ఢిల్లీ సరిహద్దులో వందల మంది బలగాలను మోహరించారు. రెజ్లర్ల ఆందోళనకు మద్దతు పలికేందుకు వస్తున్న రైతుల వాహనాలను టిక్రీ, ఘజియాబాద్, ఫరీదాబాద్తో పాటు పలు సరిహద్దు ప్రాంతాల వద్ద పోలీసులు అడ్డుకొన్నారు. ట్రాక్లర్లలో వచ్చిన వారిని అనుమతించలేదు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు, ఇతర అడ్డంకులను దాటుకొంటూ రైతులు, మహిళా రైతులు దీక్షా శిబిరం వద్దకు చేరుకొన్నారు.
డబ్ల్యూఎఫ్ఐ అనుబంధ హర్యానా అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ముగ్గురు సభ్యులను సస్పెండ్ చేసింది. బ్రిజ్ భూషణ్కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పాల్గొన్నందుకు వీరేందర్సింగ్ దలాల్, సంజయ్సింగ్ మాలిక్, భగవాన్ అనే వారిని సస్పెండ్ చేస్తూ హెచ్ఏడబ్ల్యూఏ రాష్ట్ర అధ్యక్షుడు రోహతాస్సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
తమ ఆందోళనకు మద్దతు పలికిన వారికి రెజ్లర్లు వినేశ్ ఫొగట్, సాక్షి మాలిక్ తదితరులు ధన్యవాదాలు తెలిపారు. ఇది దేశం గౌరవం కోసం జరుగుతున్న పోరాటమని ఒలింపియన్ భజరంగ్ పునియా పేర్కొన్నారు. దీక్షా శిబిరం వద్ద ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ తమకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇది దేశ బిడ్డల, తల్లుల గౌరవంతో పాటు దేశ గౌరవాన్ని కాపాడేందుకు జరుగుతున్న పోరాటం అని అన్నారు. తమకు మద్దతుగా వచ్చిన వారికి ఈ సందర్భంగా పునియా కృతజ్ఞతలు తెలిపారు.