మహారాష్ట్రలోని హింగోలి జిల్లాకు చెందిన రేఖా వాగ్మారే భర్త నాందేవ్ ఓ రైతు. పంటకు గిట్టుబాటు ధర లేక అత్మహత్య చేసుకొన్నాడు. దీంతో భార్య, పిల్లలు కష్టాల కడలిలో చిక్కుకొన్నారు. రూ.4 లక్షల బ్యాంకు రుణభారం వీరిపై పడింది. ఇంటికి పెద్ద దిక్కు లేక, చేతిలో చిల్లిగవ్వ లేక, సరైన తిండి లేక ఇబ్బందులు పడుతున్న రేఖ కుటుంబంపై మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం పెద్ద బండ వేసింది. అత్మహత్య చేసుకొన్న రైతుల కుటుంబాలకు ఆదుకునేందుకు ఉద్దేశించిన రేషన్ పథకానికి మంగళం పాడింది. ఆహార ధాన్యాల బదులుగా నెలకు రూ.150 ఇస్తామని బాధిత కుటుంబాల కడుపు మాడ్చే నిర్ణయం తీసుకొన్నది. రేఖలాగే రైతు ఆతహత్యల కారణంగా భర్తలను కోల్పోయిన వేలాది మంది మహిళల, వారి కుటుంబాల దుస్థితి ఇదీ.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): ఆత్మహత్య చేసుకొన్న రైతు కుటుంబాలకు అండగా ఉండాల్సింది పోయి.. అందుకు విరుద్ధంగా వారి కడుపు కొడుతున్నది మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఎక్కువగా జరిగే 14 జిల్లాల్లో బాధిత కుటుంబాలకు ఇటీవల వరకు సబ్సిడీపై ఆహార ధాన్యాలు అందేవి. అయితే ఈ పథకానికి అక్కడి సర్కారు మంగళం పాడుతూ దాని స్థానంలో నగదు బదిలీ ప్రవేశపెట్టింది. ఆహార ధాన్యాలకు బదులు ఒక్కొక్క కుటుంబసభ్యుడికి రూ.150 ఇచ్చేందుకు ఇటీవల నిర్ణయం తీసుకొన్నది. అయితే కుటుంబంలో ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున ఇస్తున్న ఆహార ధాన్యాలతో కొంతమేర కడుపు నింపుకొంటున్న తమకు ప్రస్తుతం నిత్యావసర ధరలు పెరిగిన ఈ కాలంలో ఆ రూ.150 ఎంత మాత్రం అక్కరకు వస్తాయని బాధిత కుటుంబాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి.
14 జిల్లాల్లో నిరసనలు
రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరిగే మరఠ్వాడ, విదర్భ ప్రాంతాల్లోని ఔరంగాబాద్, జాల్నా, బీడ్, నాందేడ్, ఉస్మానాబాద్, పర్భనీ, లాతూర్, హింగోలి, అమరావతి, వాషం, ఆకోలా, బుల్దానా, యవత్మాల్, వర్దా జిల్లాల్లో నగదు బదిలీ నిర్ణయాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది రైతు కుటుంబాల జీవనానికి పెద్ద సమస్యగా మారింది. రేషన్ సరుకులు కట్ చేసి రూ.150 ఇచ్చి మమ్మల్ని రోడ్డున పడేస్తారా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఒక్కో వ్యక్తికి నగదుగా ఇచ్చే రూ.150 ఏమాత్రం సరిపోవని, దాంతో తాము అర్ధాకలితో పడుకోవలసిందేనా? అని ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి. బజారులో కనీసం రూ.50కు తక్కువ కాకుండా కిలో బియ్యం ఉన్నాయని వాపోతున్నారు.
ఏటా వేలల్లో అత్మహత్యలు
ప్రతి ఏటా రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, ఎన్నికలప్పుడు మాత్రం కల్లబొల్లి మాటలు చెప్పి ఓట్లు దండుకోవాలని చూస్తారని బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహారాష్ట్రలో 2015 నుంచి 2018 వరకు 12 వేలకు పైగా రైతులు ఆత్యహత్యలు చేసుకున్నట్టు అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. 2021తో పోలిస్తే 2022లో మహారాష్ట్రలోని మరఠ్వాడా, విదర్భ ప్రాంతాల్లో మరింత పెరిగాయి. గత ఏడాది 8 నెలల్లోనే 1,875 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు లెక్కలు చెప్తున్నాయి.
ఏం కొనాలి? ఏం తినాలి?
గిట్టుబాటు ధర లేక, అప్పు తీర్చలేక నా భర్త నాందేవ్ ఆత్మహత్య చేసుకున్నాడు. నేను కూలీకి వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నాను. రేషన్ సరుకుల రద్దు నిర్ణయం సరైనది కాదు. బజారులో నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్నాయి. రూ.150లతో మేం ఏం సరుకులు కొనుక్కోవాలి? ఏం తినాలి? అప్పులు ఎలా తీర్చాలో, పిల్లలను ఎలా చదివించాలో, ఎలా బతకాలో బీజేపీ ప్రభుత్వమే చెప్పాలి. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ఆందోళనలకు దిగుతాం.
– రేఖా వాగ్మారే, నందుసా గ్రామం, హింగోలి జిల్లా
బతుకు భారం
నా భర్త మాధవరావు 1.7 లక్షల అప్పు కట్టలేక 2018లో ఆత్మహత్య చేసుకున్నాడు. నాకు నలుగురు అమ్మాయిలు. ప్రస్తుతం రూ.4,500 జీతానికి పనిచేస్తున్నాను. రేషన్ సరుకులతో ఎలాగో బతుకుతున్నాం. రేషనుకు బదులుగా ఇచ్చే కొద్ది డబ్బు ఎందుకూ అక్కరకు రాదు. నాకొచ్చే జీతంలో పిల్లల చదువులు, అనారోగ్య సమస్యలు లాంటి వాటితో బతుకు భారంగా మారుతుంది.
– వర్షా ఖర్వాడే, పార్డి గ్రామం, హింగోలి జిల్లా