లక్నో/ముజఫర్నగర్, సెప్టెంబర్ 5: ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్కు కర్షకలోకం కదలివచ్చింది. కిసాన్ మహాపంచాయత్కు యూపీతో పాటు, పొరుగు రాష్ర్టాల నుంచి రైతులు వేల సంఖ్యలో హాజరయ్యారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని నెలల్లో జరుగనున్న నేపథ్యంలో దేశాన్ని కాపాడుకుందామంటూ అన్నదాతలు ఐక్యతను చాటారు. కొత్త వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఈ కిసాన్ మహాపంచాయత్ను సంయుక్త కిస్తాన్ మోర్చా (ఎస్కేఎం) నిర్వహించింది. ‘ఇలాంటి సభలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తాం. దేశాన్ని అమ్మేయకుండా మనం కాపాడుకోవాలి. ఇదే ఈ సభ లక్ష్యం’ అని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) జాతీయ ప్రతినిధి రాకేశ్ టికాయిత్ అన్నారు. డిమాండ్లు పరిష్కరించేదాకా ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా 300 సంఘాలకు చెందిన రైతులు సభకు హాజరయ్యారని బీకేయూ మీడియా ఇన్చార్జి ధర్మేంద్ర మాలిక్ తెలిపారు. వారికోసం 5 వేల ఫుడ్ స్టాల్స్ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. వివాదాస్పద కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనకు అన్ని కులాలు, మతాలు, రాష్ర్టాలు, చిన్న వ్యాపారులు, సమాజంలోని అన్ని వర్గాల ప్రజల మద్దతు ఉందని ముజఫర్నగర్ సభ రుజువు చేసిందని 40 రైతు సంఘాల ఉమ్మడి వేదిక ఎస్కేఎం పేర్కొంది. 15 రాష్ర్టాల నుంచి రైతులు సభకు హాజరయ్యారని తెలిపింది. కాగా, ఈ నెల 27న భారత్ బంద్కు కిసాన్ మహాపంచాయత్లో రైతులు పిలుపునిచ్చారు.
రైతుల బాధను అర్థం చేసుకోండి: వరుణ్ గాంధీ
రైతులకు బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మద్దతు ప్రకటించారు. ‘ముజఫర్నగర్లో నిరసనకు పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు. రైతులు మన సొంత మనుషులే. వారితో గౌరవప్రదమైన రీతిలో చర్చలను తిరిగి ప్రారంభించండి. వారి బాధను అర్థం చేసుకోండి. వారి అభిప్రాయాలను తెలుసుకోండి. వారితో కలిసి ఒక పరిష్కారానికి కృషి చేయండి’ అని వరుణ్ గాంధీ ట్విట్టర్లో పేర్కొన్నారు.