లఖింపూర్ ఖీరీ: యూపీలోని లఖింపూర్ ఖీరీలో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్ తొక్కేయడం, దరిమిలా చోటుచేసుకున్న ఘటనల్లో ప్రాణాలుకోల్పోయిన నలుగురు రైతులకు మంగళవారం పలు రాష్ర్టాల రైతులు శ్రద్ధాంజలి ఘటించారు. ఘటనాస్థలి వద్ద సిక్కు సంప్రదాయం ప్రకారం ‘అంతిమ్ అర్దాస్’ (ప్రార్థనలు) నిర్వహించారు. కేంద్ర సాగు చట్టాలపై పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని రైతు నాయకులు ప్రతినబూనారు. యూపీతో పాటు పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ర్టాలకు చెందిన రైతులు పెద్దసంఖ్యలో హాజరయ్యారని సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. రైతు నాయకులు ముందుగా నిర్ణయించిన ప్రకారం వేదికపై ఎవరూ కూర్చోలేదు. ఈ కార్యక్రమంలో రైతు నేత రాకేశ్ టికాయిత్, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ, ఆర్ఎల్డీ నాయకుడు జయంత్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రియాంక రాకను వ్యతిరేకిస్తూ లఖింపూర్ మార్గంలో ఫ్లెక్సీలు వెలిశాయి. నకిలీ సానుభూతి తమకు అవసరం లేదని ఆ ఫ్లెక్సీల్లో రాశారు.