Karnataka | హైదరాబాద్, అక్టోబర్ 26 (స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ): ఐదు నెలల కాంగ్రెస్పాలనలో కర్ణాటక రైతులు అరిగోస పడుతున్నారు. ఎవుసానికి నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన హస్తంపార్టీ గద్దెనెక్కిన తర్వాత ఆ వాగ్దానాన్ని పక్కనబెట్టింది. కనీసం ఐదు గంటలైనా కరెంటివ్వండంటూ అన్నదాతలు రోడ్లెక్కినా పట్టించుకొన్న పాపాన పోలేదు. దీంతో సాగుకు నీరులేకపోవడంతో చేతికొచ్చిన పంట ఎండిపోతున్నది. దీన్ని చూసి తట్టుకోలేని అన్నదాతలు సొంత డబ్బులతో నీటి ట్యాంకర్లను పొలాలకు తెప్పించుకొని పంటను కాపాడుకొంటున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి.
గడిచిన నెలన్నర వ్యవధిలో దక్షిణ భారతంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో వానలు పడలేదు. తెలంగాణతో పాటు పొరుగున ఉన్న కర్ణాటకలోనూ ఇదే పరిస్థితి. అయితే, ఎవుసానికి అమిత ప్రాధాన్యమిచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుచూపుతో సాగుకు అవసరమైన నీటి వసతిని, 24 గంటల ఉచిత విద్యుత్తును తెలంగాణ అన్నదాతలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో వానలు పడకపోయినప్పటికీ, రాష్ట్రంలో రైతులు సంబురంగా ఎవుసాయ పనులు చేసుకొంటున్నారు. ఇక, కర్ణాటకలో దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొన్నది. ఎన్నికల ప్రచారంలో వ్యవసాయానికి నిరంతరాయ విద్యుత్తును ఇస్తామన్న కాంగ్రెస్ ఆ తర్వాత ఆ హామీని తుంగలో తొక్కింది. సాగుకు కనీసం గంటసేపైనా విద్యుత్తు సరఫరా చేయట్లేదు. దీంతో రాయచూర్, యాద్గిర్, గదగ్ తదితర జిల్లాల్లోని వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయే దుస్థితి దాపురించింది. సాగుకు కనీసం 5 గంటల కరెంటునైనా ఇవ్వండంటూ ఆయా జిల్లాల్లోని రైతులు ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్లు, విద్యుత్తు కార్యాలయాల ముందు నిరసనలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ, సమస్య పరిష్కారం కాలేదు. దీంతో చేసేదేమీలేక, జేబుల్లోంచి సొంత డబ్బులు తీసి నీటి ట్యాంకర్లను తెప్పించి పొలాలను తడుపుతున్నారు. రాష్ట్రంలోని అన్నిప్రాంతాల్లో దాదాపు ఇదే పరిస్థితి తలెత్తినట్టు వార్తలు వస్తున్నాయి.
సాగునీటికి గోస పడుతున్న రైతులను ట్యాంకర్ మాఫియా కొత్త ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఎకరం పొలాన్ని పూర్తిగా తడుపడానికి రూ. 4 వేల వరకు రుసుము తీసుకొంటున్నారని పలువురు రైతులు వాపోతున్నారు. ఒక్కో ట్రిప్పుకు రూ. 500 అదనంగా వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు. పంటలు ఎండిపోతుండటంతో గత్యంతరంలేక అడిగినంత డబ్బు ఇవ్వాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్తు కోతలకు నిరసనగా కర్ణాటకవ్యాప్తంగా రైతన్నల నిరసనలు కొనసాగుతున్నాయి. వ్యవసాయానికి సరిపడినంత విద్యుత్తు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పలు విద్యుత్తు కార్యాలయాల ముందు గురువారం కూడా అన్నదాతలు ఆందోళనలు చేపట్టారు. విజయపుర జిల్లా కొల్హారా తాలూకాలోని రోణిహల్ గ్రామ రైతులు.. హుబ్లీ ఎలక్ట్రిసిటీ సైప్లె కంపెనీ కార్యాలయానికి ఓ ట్రాక్టర్లో మొసలిని తీసుకొచ్చి ఇటీవల నిరసన వ్యక్తం చేశారు. గుల్బర్గా జిల్లాలో రైతన్నలు పురుగుల మందుల డబ్బాలతో విద్యుత్తు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఇక, కోతలను నిరసిస్తూ కర్ణాటక ఫార్మర్స్ అసోసియేషన్ (కేఎఫ్ఏ) ఆధ్వర్యంలో మంగళవారం మైసూరులోని బెంగళూరు-మైసూరు హైవేను రైతన్నలు దిగ్బంధించేందుకు యత్నిస్తే, కేఎఫ్ఏ అధ్యక్షుడు కురుబూర్ శాంతకుమార్ సహా పలువురు రైతు నేతలను పోలీసులు అరెస్ట్ చేయడం, ఈ అరెస్టులను విపక్షాలు ఖండించడం తెలిసిందే.
నీటి సరఫరా లేకపోవడంతో పంటలు ఎండిపోయే దుస్థితి దాపురించింది. వానలు కూడా లేకపాయె. ఇక, నీటి ట్యాంకర్లు తెప్పించుకొని పంటలను కాపాడుకొంటున్నాం. ఇదే అదునుగా ట్యాంకర్ ఓనర్లు ఎక్కువగా చార్జ్ చేస్తున్నారు. గత్యంతరం లేనిపరిస్థితుల్లో డబ్బులు చెల్లించాల్సి వస్తున్నది. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకమే.
– శరణు గౌడార్, రైతు, లకే్ష్మశ్వర్ గ్రామం, గదగ్ జిల్లా