ముంబై, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా రైతులకు వింత అనుభవం ఎదురైంది. పంట నష్టానికి వచ్చిన రూ.2, రూ.3 పరిహారం చూసి అవాక్కవడం వారి వంతయింది. ఈ ఏడాది జూలైలో కురిసిన అధిక వర్షాలతో పంట నష్టపోయిన 59,404 మంది రైతుల ఖాతాల్లో పంటల బీమాకు సంబంధించి దాదాపు రూ.41.1 కోట్లు జమ అయినట్టు జిల్లా అధికారులు ఇటీవల ప్రకటించారు. దీంతో రైతులు బ్యాంకుకు వెళ్లగా.. తమ ఖాతాల్లో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ జమ చేసిన డబ్బు చూసి అవాకయ్యారు. చాలా మంది ఖాతాల్లో రూ.2, రూ.3 పడ్డాయి. దీంతో ఇన్సూరెన్స్ కంపెనీ తమ నోట్లో మట్టి కొట్టిందని బాధిత రైతులు వాపోతున్నారు.
వరజడి గ్రామానికి చెందిన మనోజ్ రాథోడ్ అనే రైతు ఖాతాలో రూ.2, అతని తమ్ముడు దేవానంద్ ఖాతాలో రూ.2, యావాలి గ్రామానికి చెందిన రైతు మెరాసింగ్ రమణ్ రాథోడ్ ఖాతాలో రూ.3, ఇంకా చాలా మంది ఖాతాల్లో ఇలాగే జమ చేసినట్టు ఉందని జిల్లా శివసేన అధ్యక్షుడు సంతోష్ ధవళే ఆరోపించారు. రైతుల పుండుపై ప్రభుత్వం కారం రాస్తున్నదని, దీనిని సహించేది లేదని హెచ్చరించారు. పంట నష్టంపై రీ సర్వే జరిపించి రైతులకు న్యాయం చేయాలని, లేకపోతే ఆందోళనలు చేస్తామని పేర్కొన్నారు. యావత్మాల్ జిల్లాలో జూలై నెలలో కురిసిన అతివృష్టి కారణంగా తమ పంట నష్టపోయినట్టు 5,25,541 రైతులు పంట బీమా పథకం కింద పరిహారానికి దరఖాస్తు చేసుకొన్నారు.