న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: మాట తప్పిన మోదీ సర్కారు మెడలు వంచేవరకు ఈసారి వెనుదిరగబోమని, తమ డిమాండ్లు నెరవేరేవరకు దేశ రాజధానిని విడిచేది లేదంటూ వేల మంది రైతులు ఢిల్లీ వైపు పయనమయ్యారు. కనీసం ఆరు నెలలకు సరిపోయేటన్ని ఆహార పదార్థాలు, డీజిల్ను వెంట తీసుకెళ్తున్నామని చెప్పారు. రైతులు రాజధాని నగరంలోకి ప్రవేశించకుండా పోలీసులు ఇప్పటికే ఎక్కడికక్కడ అన్ని మార్గాల్లో ముళ్ల కంచెలతో బారికేడ్లు ఏర్పాటుచేశారు.
ఇంతకుముందు 2020లో 13 నెలల పాటు ఢిల్లీ సరిహద్దుల్లో మోహరించిన రైతులు నాటి తమ ఆందోళనకు కొనసాగింపుగానే మరోసారి ఉద్యమించినట్టు చెప్తున్నారు. పంటకు కనీస మద్దతు ధరతోపాటు ఇంకా అనేక డిమాండ్ల సాధన కోసం వారు మరోమారు ఆందోళన బాటపట్టారు. తమ సహనానికి ఎంత పరీక్ష పెట్టినా ఈసారి తమ డిమాండ్లు నెరవేరేవరకు ఆందోళన విరమించేది లేదన్నారు.
‘సూది నుంచి సుత్తి వరకు.. రాళ్లను సైతం బద్దలుకొట్టే అన్ని పనిముట్లు మా ట్రాక్టర్ ట్రాలీల్లో ఉన్నాయి. ఆర్నెల్ల రేషన్తో మా గ్రామాల నుంచి బయలుదేరాం. మాకే కాదు మా హర్యానా సోదరులకు సైతం సరిపోయేంత డీజిల్ కూడా మా వద్ద ఉన్నది’ అని పంజాబ్లోని గుర్దాస్పూర్కు చెందిన హర్భజన్ సింగ్ అనే రైతు చెప్పారు. తాను 2020లో జరిగిన రైతుల ఆందోళనలో కూడా పాల్గొన్నానని, ఈసారి తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు.
తన ట్రాక్టర్కు రెండు ట్రాలీలను అనుసంధానం చేసి ఆయన ఢిల్లీ వైపు బయలుదేరారు. పంజాబ్, హర్యానాల్లోని అనేక బంకుల్లో రైతుల ట్రాక్టర్లకు డీజిల్ అందకుండా కృత్రిమ కొరతను సృష్టించినట్టు వార్తలు వచ్చాయి. ‘ఇంతకుముందు 13 నెలలు ఏకధాటిగా ఢిల్లీ సరిహద్దులను దిగ్బంధం చేశాం. దీంతో మా డిమాండ్లన్నింటినీ నెరవేరుస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. కానీ ఆ వాగ్దానాన్ని ఇంతవరకు నిలబెట్టుకోలేదు. ఈసారి మాత్రం వాగ్దానాలకు లొంగే ప్రసక్తే లేదు’ అని మరో రైతు చెప్పారు.