ఓ చిరుద్యోగి తన యజమాని ఏటా ఓ ఐదువందలైనా జీతం పెంచనిదే పనిచేయడు. పట్నంలో ఆటోవాలా పెట్రోల్ ధర పెరిగినప్పుడల్లా మీటర్ చార్జీ పెంచేస్తుంటాడు. అడ్డమీద కూలీ కూడా అక్కడి అవసరాన్ని బట్టి తన కూలి రేటును తానే నిర్ణయిస్తాడు. అందుకే ఇతర రంగాలతో పోటీ పడేలా 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని 2014లోనే ప్రధాని నరేంద్రమోదీ ఆర్భాటంగా ప్రకటించారు.
ఆయన ఎనిమిదేండ్ల పాలనలో రైతుల ఆదాయం ఎంత పెరిగిందో తెలుసా? అక్షరాలా రూ.3,658. ఇది అల్లాటప్పా వ్యక్తులు చెప్పిన లెక్క కాదు. దేశంలో వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న నాబార్డ్ చెప్పిన లెక్క. అంటే మోదీ సర్కారు ఈ ఎనిమిదేండ్లలో పెంచిన వంటగ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్, వంటనూనె ధరలకు కూడా రైతు ఆదాయ వృద్ధి సమానం కాదని స్పష్టమవుతున్నది.
హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాటల్లో ఎంత సత్యముందో తేలిపోయింది. బీజేపీ సర్కారు పాలనకు రైతుల అరకొర ఆదాయమే సాక్ష్యంగా నిలుస్తున్నది. మోదీ సర్కారు ఏడేండ్ల పాలనలో రైతులకు పెరిగిన నెలవారీ ఆదాయం రూ.3,658 మాత్రమే. ఇందులో ఎస్సీ, ఎస్టీ రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది. నాబార్డ్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో రైతుల ఆదాయానికి సంబంధించి పలు సంచలన విషయాలను వెల్లడించింది. 2012-13లో దేశంలో రైతుల నెలవారీ ఆదాయం రూ.6,426 ఉండగా 2018-19 నాటికి రూ.10,084కు పెరిగినట్టు తెలిపింది. అంటే ఏడాదికి పెరిగిన ఆదాయం 2.5 శాతం మాత్రమే.
నష్టాలు, కష్టాలే
పంట సాగుతో రైతులకు ఆర్థికంగా నష్టం వాటిల్లుతున్నదని నాబార్డ్ తన నివేదికలో వెల్లడించింది. గడిచిన ఏడేండ్లలో పంట ఉత్పత్తుల ద్వారా వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోయింది. వ్యవసాయ, అనుబంధ రంగాల మొత్తం ఆదాయంలో పంట ఉత్పత్తుల వాటా 2012-13లో 48 శాతంగా ఉంటే, 2018-19 నాటికి 38 శాతానికి తగ్గింది. అంటే ఏడేండ్లలో పంటల ద్వారా వచ్చే ఆదాయంలో ఏకంగా 10 శాతం పడిపోయింది. అన్ని వర్గాల రైతుల ఆదాయంలోనూ తగ్గుదల నమోదైంది. ఎస్సీ రైతుల ఆదాయం 7.32, ఎస్టీ రైతుల ఆదాయం 9.32, ఓబీసీ రైతుల ఆదాయం 11.12, ఇతర రైతుల ఆదాయం 11.45 శాతం తగ్గిందని నాబార్డ్ వెల్లడించింది.
ఎస్సీ, ఎస్టీ రైతుల పరిస్థితి దారుణం
మొత్తం రైతుల ఆదాయం అంతంత మాత్రంగానే ఉందంటే.. ఇందులో ఎస్సీ, ఎస్టీ రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉన్నట్టు నివేదికలో వెల్లడైంది. ఈ వర్గాల రైతులకు మొత్తం రైతుల నెలవారీ సగటు ఆదాయం రూ.10,084 కన్నా తక్కువ ఉన్నది. ఎస్సీ రైతుల నెలవారీ ఆదాయం 2012-13లో రూ. 4,539 ఉండగా, 2018-19లో రూ.8,142 కి పెరిగింది. ఎస్టీ రైతుల ఆదాయం 2012-13లో రూ. 5,864 ఉండగా, 2018-19 నాటికి రూ.8,979కు పెరిగింది. అంటే గడిచిన ఏడేండ్లలో ఎస్సీల రైతుల ఆదాయం రూ.3,603, ఎస్టీల ఆదాయం రూ.3,115 మాత్రమే పెరగడం గమనార్హం. రైతుల ఆదాయం పెరుగుదల అంతంత మాత్రంగా ఉండటంపై నాబార్డ్ ఆందోళన వ్యక్తం చేసింది. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీ నెరవేరాలంటే ఈ పెరుగుదల ఏ మాత్రం సరిపోదని కుండబద్ధలు కొట్టింది. రైతుల ఆదాయం పెరిగేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని సూచించింది.
రైతుల ఆదాయం పెరుగుదల అంతంత మాత్రంగానే ఉన్నదని నాబార్డ్తోపాటు పార్లమెంటరీ స్థాయీ సంఘం మొత్తుకొంటుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం నిస్సిగ్గుగా రైతుల ఆదాయం రెట్టింపు అయ్యిందని ఇటీవల ప్రకటించింది. 2022 ఆగస్టు నాటికి దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని 2014 ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఆ హామీ నీటి మూటగానే మారింది. ఆదాయాల పెంపునకు చర్యలు చేపట్టకపోగా, వ్యవసాయానికి ప్రధానమైన ఎరువులు, డీజిల్ ధరలను భారీగా రైతులపై మోయలేని పెట్టుబడి భారం మోపింది. పంటలకు మద్దతు ధర నిర్ణయించటంలోనూ తీవ్ర అన్యాయం చేసిందని రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. మోదీ లెక్కల ప్రకారం ప్రస్తుతం రైతుల నెలవారీ ఆదాయం రూ.21 వేలకు పైగా ఉండాలని, కానీ రూ.10 వేలు కూడా దాటలేదని గుర్తుచేస్తున్నారు.