చండీగఢ్: బీజేపీ మంత్రి ఇంటి ముందు రైతులు బైఠాయించారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలైన అదానీ, అంబానీలకు పేదల భూములు ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేశారు. హర్యానాలోని అంబాలలో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్ర హోంమంత్రి అనిల్ విజ్ నివాసం వద్ద రైతులు గురువారం నిరసన తెలిపారు. ఆయన ఇంటి ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పంచాయతీల పేరుతో కేటాయించిన భూములను అదానీ, అంబానీలకు ఇవ్వాలని హర్యానా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రైతులు తప్పుపట్టారు. ఈ అంశంపై చర్చించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని అన్నదాతలు డిమాండ్ చేశారు.
మరోవైపు రైతులు తన ఇంటి వద్ద నిరసనకు దిగడంపై మంత్రి అనిల్ విజ్ స్పందించారు. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని అన్నారు. పరిస్థితిని తాము పరిశీలిస్తున్నామని చెప్పారు. అలాగే బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ గోవాలో అనుమానాస్పదంగా మరణించడంపై ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. నిజాలు వెల్లడయ్యేందుకు ఉన్నత స్థాయి దర్యాప్తు కోసం వారు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు.