హావేరి, నవంబర్ 28: కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారు పాలనలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్తును అందిస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. హామీ అమలులో ఘోరంగా విఫలమైంది. ఎడాపెడా విద్యుత్తు కోతలతో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. దీంతో పంట చేతికి వచ్చే పరిస్థితి లేక, అప్పులు తీర్చలేని స్థితిలో వందలాది మంది అన్నదాతలు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారుపై రైతులు నిరసనలకు సిద్ధమవుతున్నారు.
రుణమాఫీ చేయాల్సిందే..
వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని సిద్ధరామయ్య సర్కారును రైతులు డిమాండ్ చేస్తున్నారు. వచ్చే నెల 23న బెంగళూరులో నిరసన భేరి మోగించబోతున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రీయ కిసాన్ మహా పంచాయత్ అధివేషణ ఆధ్వర్యంలో నిరసన చేపడుతామని రాష్ట్ర చెరుకు రైతుల సంఘం అధ్యక్షుడు కురుబర్ శాంతకుమార్ హెచ్చరించారు. కరువు కారణంగా రైతులు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం రైతులకేమీ సాయం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘కరువు తాలుకాల్లో రైతులకు విత్తన ఖర్చులు కూడా తిరిగి రాలేదు. ఈ కారణాలన్నింటి వల్ల బెంగళూరులో నిరసన సభ నిర్వహిస్తున్నాం’ అని తెలిపారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని, 60 ఏండ్లకు పైబడిన రైతులకు కనీసం రూ.5 వేలు పింఛను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ‘చెరకు పంట నష్టాలను ఎన్డీఆర్ఎఫ్ కింద పరిగణించి పంట నష్ట పరిహారం మంజూరు చేయాలి. తక్కువ దిగుబడి చూపించి, తూకాల్లో మోసాలు చేసే పరిశ్రమలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.