యూపీలో బీజేపీకి కష్టకాలం నడుస్తోందని విశ్వ హిందూ పరిషత్ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ భాయ్ తొగాడియా అన్నారు. యూపీలోని రైతులందరూ బీజేపీ విషయంలో తీవ్ర నిరాశలో ఉన్నారని, అందుకే బీజేపీ ఎదురు దెబ్బ ఖాయమని పేర్కొన్నారు. నాగపూర్లో విలేకరులతో మాట్లాడుతూ… తొగాడియా ఈ వ్యాఖ్యలు చేశారు. కనీస మద్దతు ధర, నష్ట పరిహారం.. ఈ రెండు విషయాలపైనే రైతులు ఎదురు చూస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం ఈ రెండు విషయాలను పెద్దగా పట్టించుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు.
రష్యా- ఉక్రెయిన్ మధ్య వివాదం ముదురుతున్న మొదట్లోనే భారత ప్రభుత్వం స్పందించి వుంటే బాగుండేదన్నారు. కొంత ఆలస్యం కారణంగా ఓ భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన దేశంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కేవలం 45,000 సీట్లు మాత్రమే ఉన్నాయని, మెడికల్ విద్య అభ్యసించడం అత్యంత కష్టంగా మారిందన్నారు. అందుకే భారతీయ విద్యార్థులు ఇతర దేశాలకు మెడిసిన్ చదువు కోసం వెళ్తున్నారని తొగాడియా వివరించారు.