న్యూఢిల్లీ : సాగు చట్టాల రద్దు సహా పలు డిమాండ్లతో ఏడాదికి పైగా రైతులు సాగిస్తున్న ఆందోళనకు తెరపడనుంది. రైతుల పెండింగ్ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీకి కేంద్ర ప్రభుత్వం పంపిన తాజా ప్రతిపాదనపై సుదీర్ఘ సమాలోచనల అనంతరం కమిటీ స్పందించింది. ప్రభుత్వ ప్రతిపాదనల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన కమిటీ వాటిని ఆమోదించింది.
రైతులపై నమోదైన క్రిమినల్ కేసులను తక్షణమే ఉపసంహరించేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేయడంతో రైతు సంఘాల కమిటీ మెత్తబడినట్టు సమాచారం. ఆందోళన విరమించే విషయమై ఎస్కేఎం కమిటీ గురువారం మరోసారి సమావేశమై కీలక ప్రకటన చేయనుంది. కాగా, తమ డిమాండ్లపై స్పందిస్తూ ప్రభుత్వం పంపిన తాజా ప్రతిపాదనపై కమిటీ చర్చిస్తోందని అంతకుముందు కమిటీ సభ్యులు అశోక్ ధవలే తెలిపారు. ప్రభుత్వం ముందుగా పంపిన ప్రతిపాదనలో లోటుపాట్లు ఉండటంతో వాటికి సవరణలు సూచిస్తూ మంగళవారం రాత్రి దాన్ని తిరిగి ప్రభుత్వానికి పంపామని చెప్పారు.
వివాదాస్పద సాగు చట్టాలను ఉపసంహరించినా పెండింగ్ అంశాలపై ప్రభుత్వం నిర్ధిష్ట హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని రైతు సంఘాల ప్రతినిధులు తేల్చిచెప్పారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పించడం, విద్యుత్ సవరణల బిల్లు ఉపసంహరణ, రైతులపై నమోదైన కేసుల రద్దు, రైతుల నిరసనలో మరణించిన అన్నదాతల కుటుంబాలకు పరిహారం చెల్లింపు వంటి అంశాలను ప్రధానంగా రైతు సంఘాలు కేంద్రం ముందుంచాయి.