న్యూఢిల్లీ: భారత వాయు సేన (ఐఏఎఫ్)కు చెందిన మిగ్-21 యుద్ధ విమానం కూలిన ఘటనలో మరణించిన పైలట్ కుటుంబానికి విమానంలో షాకింగ్ అనుభవం ఎదురైంది. రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలోని బిమ్రా సమీపంలో గురువారం సాయంత్రం మిగ్-21 విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్లు వింగ్ కమాండర్ ఎం రాణా, ఫ్లైట్ లెఫ్టినెంట్ అద్వితీయ బల్ మరణించారు. ఈ నేపథ్యంలో బల్ మృతదేహాన్ని తీసుకునేందుకు ఆయన కుటుంబ సభ్యులు శుక్రవారం ఇండిగో విమానంలో ఢిల్లీ నుంచి జోధ్పూర్ వెళ్లారు.
కాగా, మిగ్-21 ప్రమాదంలో చనిపోయిన ఫ్లైట్ లెఫ్టినెంట్ అద్వితీయ బల్ కుటుంబానికి ఆ విమానంలో చేదు అనుభవం ఎదురైంది. విమానం జోధ్పూర్లో ల్యాండ్ అయిన తర్వాత మూడో వరుసలో కూర్చొన్న ఆ కుటుంబ సభ్యులు ముందుగా దిగేందుకు దారి ఇవ్వాలని ఫ్లైట్ కెప్టెన్ ఎనౌన్స్ చేశారు. అయితే ఏ మాత్రం మానవత్వం, జాతీయత, సైనికుల పట్ల గౌరవం లేనట్లుగా కొందరు ప్రవర్తించారు. 1, 2 వరుసల్లో ఉన్న ప్రయాణికులు కెప్టెన్ ప్రకటనను వ్యతిరేకించారు.
మరోవైపు ఆ కుటుంబంతోపాటు మూడో వరుసలో కూర్చొన్న ఆర్థిక నేరాలు, కార్పొరేట్ గవర్నెన్స్ న్యాయవాది షేర్బీర్ పనాగ్, మరి కొందరు ప్రయాణికులు దీనిని ఖండించారు. కుమారుడ్ని కోల్పోయి పుట్టెడు దుఖంతో ఉన్న ఆ కుటుంబానికి దారి ఇవ్వాలంటూ పెద్దగా గళమెత్తారు. అనంతరం పనాగ్ ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. ‘తోటి సోదరులు, సోదరీమణులు ఇలా స్వార్థపూరితంగా ప్రవర్తించడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. యుద్ధ వీరుల త్యాగం పట్ల మనకున్న నిజమైన గౌరవం ఇది’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
I and a few passengers had to scream at the top of our voices to make them sit down and allow the Bal family to pass. It was absolutely shocking to see one’s fellow country men and women behave in this tone deaf, selfish manner. Thats the reality of our respect for sacrifice 2/2
— Sherbir Panag 🇮🇳 (@Sherbir) July 29, 2022