చండీగఢ్: ఒక కంపెనీలో నకిలీ తనిఖీలు నిర్వహించిన నలుగురు సీబీఐ అధికారులను అరెస్ట్ చేశారు. అవినీతికి పాల్పడిన వారిని సర్వీస్ నుంచి కూడా తొలగించారు. ఈ మేరకు సీబీఐ ప్రధాన కార్యాలయం గురువారం పేర్కొంది. సీబీఐకి చెందిన నలుగురు అధికారులు మరో ఇద్దరితో కలిసి ఈ నెల 10న చండీగఢ్లోని ఒక కంపెనీలో నకిలీ రైడ్ చేశారు. ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడంతోపాటు ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు ఆ కంపెనీ యజమానిపై ఆరోపణలు చేశారు. ఆయనను బలవంతంగా కారులో తీసుకెళ్లి బెదిరించారు. రూ.25 లక్షలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో నకిలీ రైడ్ అన్న విషయం బయటపడింది. దీంతో ఆ వ్యాపారి ఈ విషయాన్ని సీబీఐ దృష్టికి తీసుకెళ్లారు.
కాగా, అధికారుల అవినీతి ఆరోపణలపై సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ స్పందించారు. నకిలీ రైడ్తో డబ్బులు డిమాండ్ చేసిన నలుగురు సీబీఐ అధికారులపై చర్యలకు ఆదేశించారు. దీంతో ఢిల్లీ సీబీఐ కార్యాలయానికి చెందిన ఎస్ఐలు సుమిత్ గుప్తా, ప్రదీప్ రాణా, అంకుర్ కుమార్, ఆకాష్ అహ్లావత్పై అవినీతికి సంబంధించిన కేసులు నమోదు చేశారు. వారిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ అధికారుల ఇళ్లలో సోదాలు చేశారు. నకిలీ రైడ్కు సంబంధించి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు అవినీతి పట్ల జీరో టాలరెన్స్ విధానం మేరకు ఆ నలుగురు అధికారులపై సీబీఐ శాఖాపరమైన చర్యలు చేపట్టింది. నకిలీ రైడ్ పేరుతో అవినీతికి పాల్పడిన వారిని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసింది.