ముంబై : మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు రియాజ్ భాటితో తనకు సంబంధాలున్నాయని మాలిక్ చేసిన ఆరోపణలపై ఫడ్నవీస్ స్పందించారు. పందితో తలపడరాదని..దాంతో తలపడితే మీకు మురికి అంటుతుందని, దాన్ని పంది ఇష్టపడుతుందని ఫడ్నవీస్ ట్వీట్ చేశారు. కాగా దావూద్ అనుచరుడు ఫేక్ పాస్పోర్ట్ రాకెట్లో పట్టుబడిన రియాజ్ భాటి దేవేంద్ర ఫడ్నవీస్తో పలు కార్యక్రమాల్లో కనిపించాడని, కాషాయ పార్టీ నేతలతోనూ ఆయన కలిసిమెలిసి తిరిగాడని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపణలు గుప్పించారు.
ప్రధాని మోదీతోనూ రియాజ్ కలిసిదిగిన ఫోటోలున్నాయని వ్యాఖ్యానించారు. ఇతరదేశాల్లోని అండర్వరల్డ్ డాన్లు దేవేంద్ర ఫడ్నవీస్ నియమించిన పోలీస్ అధికారులతో థానేలో మంతనాలు జరిపి సర్ధుబాటు చేసుకున్నారని మాలిక్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కాగా దావూద్ అనుచరుడి వద్ద తక్కువ మొత్తానికే నవాబ్ మాలిక్ విలువైన ఆస్తులను కొనుగోలు చేశారని అంతకుముందు దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర మంత్రిపై ఆరోపణలు చేశారు.