ముంబై : బీజేపీతో జతకట్టి పాతికేండ్లు వృధా చేశామని మహారాష్ట్ర సీఎం, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. శివసేన అధిపతి చరిత్రను మరిచిపోయి బీజేపీతో స్నేహం చేసి పాతికేండ్లు వ్యర్ధమయ్యాయని చెబుతున్నారని, 2012 వరకూ తమ కూటమికి బాలాసాహెబ్ నేతగా ఉన్నారని, ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలు కూటమిలో కొనసాగిన బాలాసాహెబ్ నిర్ణయంపై ప్రశ్నలు రేకెత్తించేలా ఉన్నాయని ఫడ్నవీస్ అన్నారు. శివసేన పుట్టకముందే కాషాయ పార్టీకి కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు ఉన్నారన్న విషయాన్ని ఠాక్రేకు గుర్తుచేస్తున్నామని చెప్పారు.
సేన నేతలు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గుర్తుపై పోటీ చేసిన విషయం మరువరాదని అన్నారు. శివసేన తొలి సీఎం మనోహర్ జోషీ తమ గుర్తుపైనే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారని చెప్పారు. శివసేన బీజేపీతో ఉన్నప్పుడు వారు రాష్ట్రంలో నెంబర్ వన్గా ఉండగా ఇప్పుడు వారు నాలుగో స్ధానంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఠాక్రే వ్యాఖ్యల్లో కొత్తదనం లేదని, హిందుత్వ గురించి, రామమందిర వ్యవహారంపై మాట్లాడుతున్న బీజేపీ కార్యకర్తలు లాఠీదెబ్బలు తిన్నారని రామ మందిరాన్ని ఇప్పుడు మోదీ నిర్మిస్తున్నారన్న విషయం సేన నేతలు మరిచారని దుయ్యబట్టారు.
హిందుత్వ గురించి ఠాక్రే ఇక ముందు మాట్లాడటం మానుకోవాలని ఫడ్నవీస్ హితవు పలికారు. బాలాసాహెబ్ ఠాక్రే జయంతోత్సవాలకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కనీసం ట్వీట్ చేయలేదని వ్యాఖ్యానించారు. బాల్ ఠాక్రే ఆశయాలు, విధానాలను వదిలిపెట్టిన ఉద్ధవ్ ఠాక్రేకు హిందుత్వ గురించి మాట్లాడే హక్కులేదని బీజేపీ నేత రాం కదమ్ పేర్కొన్నారు.