న్యూఢిల్లీ, మార్చి 5: సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి మెటా ప్లాట్ఫామ్లు మంగళవారం రాత్రి అకస్మాత్తుగా మొండికేశాయి. భారత్తో సహా పలుదేశాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. సాంకేతిక సమస్య వల్ల వీటి సేవల్లో అంతరాయం ఏర్పడింది. నిరంతరం సోషల్మీడియాపై ఆధారపడిన నెటిజన్లు ఈ పరిణామంతో తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. తమ అకౌంట్లు అనూహ్యంగా లాగ్ అవుట్ అయిపోవటం, తిరిగి లాగ్ ఇన్ అవుదామంటే కాకపోవటం జరగటంతో వారంతా అసహనానికి గురైనట్టు ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్డిటెక్టర్ తెలిపింది.
ఇదే విషయాన్ని ఇతర ప్లాట్ఫామ్స్పై వ్యక్తం చేశారు. డౌన్ డిటెక్టర్ వెబ్సైట్ ప్రకారం ఒక్క ఫేస్బుక్పైనే 3 లక్షల వరకు ఫిర్యాదులు వచ్చాయి. ఇన్స్టాగ్రామ్ అంతరాయంపై 20 వేల మంది ఫిర్యాదు చేశారు. ఇక మెటాకు చెందిన అన్ని యాప్లలోని వినియోగదారులు తమ పాస్వర్డ్లను రీసెట్ చేసుకోలేక ఇబ్బందులు పడ్డారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లు ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోవటం ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద ఇంటర్నెట్ అంతరాయంగా పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి.