IT Raids | న్యూఢిల్లీ, మార్చి 1: ప్రముఖ పొగాకు వ్యాపార సంస్థ బంశీధర్ గ్రూప్పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు జరిపిన దాడుల్లో కండ్లు చెదిరే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సంస్థ యాజమాని శివమ్ మిశ్రా వద్ద లంబోర్గిని, మెక్లారెన్, రోల్స్ రాయిస్ ఫాంటమ్, పోర్షె వంటి అనేక లగ్జరీ కార్లను ఐటీ అధికారులు గుర్తించారు. ఈ కార్ల విలువ దాదాపుగా రూ.50 కోట్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ఢిల్లీ, యూపీ, గుజరాత్తో పాటు పలు రాష్ర్టాల్లోని 20 ప్రాంతాల్లో ఐటీ అధికారులు శుక్రవారం ఏక కాలంలో దాడులు జరిపారు. సోదాల్లో రూ.4.5 కోట్ల నగదును సైతం స్వాధీనం చేసుకున్నారు. పొగాకు సరఫరా చేసే ఈ కంపెనీ టర్నోవర్ రూ.100 – 150 కోట్లమేర ఉన్నప్పటికీ రూ.20 కోట్లు మాత్రమే అధికారికంగా చూపిస్తున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.