న్యూఢిల్లీ, జూలై 9: ఉపరాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైన మరుసటి రోజే రాజ్యసభకు నలుగురు సభ్యులను నామినేట్ చేయటం ఎంత వరకు సమంజసం? అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 5న ఉపరాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. ఆ మరుసటి రోజే ఇళయరాజా, వీరేంద్ర హెగ్డే, పీటీ ఉష, విజయేంద్ర ప్రసాద్ను రాజ్యసభకు రాష్ట్రపతి కోటాలో బీజేపీ సర్కారు నామినేట్ చేసింది. అయితే, ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగే సమయంలో వాళ్లను నామినేట్ చేసి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కేంద్రంలోని మోదీ సర్కారు ఈ చర్యకు పాల్పడిందని రాజ్యాంగవేత్తలు విమర్శిస్తున్నారు. పార్లమెంట్ ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఉపరాష్ట్రపతి ఎన్నుకోబడతారు. అంటే.. కొత్తగా నామినేట్ అయినవారు కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేసేందుకు అర్హత సాధిస్తారు. దీన్ని అదనుగా తీసుకొని కేంద్రం ఈ అడుగు వేసిందని, బీజేపీ తీరు సరికాదని మండిపడుతున్నారు.