Omicron Effect : గత వారం రోజులుగా పలు నగరాల్లో కొవిడ్-19 కేసుల పెరుగుదల, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని పరిశీలిస్తే థర్డ్ వేవ్ తలెత్తిందనే సంకేతాలు వెల్లడవుతున్నాయని కొవిడ్-19 వర్కింగ్ గ్రూప్ ఎన్టీఏజీఐ చీఫ్ డాక్టర్ ఎన్కే అరోరా పేర్కొన్నారు. కరోనా వైరస్ తాజా కేసుల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 50 శాతం వెలుగుచూస్తున్నాయని చెప్పారు.
కరోనా కేసుల పెరుగుదలపై భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. దేశంలో 80 శాతం మంది పైగా ఇప్పటికే సహజంగా వైరస్ బారినపడ్డారని, 90 శాతం మంది పెద్దలు కనీసం కొవిడ్ వ్యాక్సిన్ సింగిల్ డోసు తీసుకున్నారని, 65 శాతం మందికి పైగా రెండు డోసులు తీసుకున్నారని గుర్తుచేశారు.
ఒమిక్రాన్ వేగంగా విస్తరించిన దక్షిణాఫ్రికా అనుభవం చూస్తే రెండు వారాల్లోనే కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని, అధిక కేసులు ఎలాంటి లక్షణాలు లేకుండా వెలుగుచూశాయని, కొన్ని కేసుల్లో స్వల్ప లక్షణాలు బయటపడ్డాయని చెప్పారు. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేవ్ త్వరలో సమసిపోనున్నట్టు సంకేతాలు వెల్లడవుతన్నాయని అన్నారు. దక్షిణాఫ్రికా, భారత్ మధ్య కొన్ని సారూప్యతలు ఉన్నాయని, సహజ ఇన్ఫెక్షన్ రేట్ ఇరు దేశాల్లో అధికంగా ఉందని అరోరా పేర్కొన్నారు.
వ్యాక్సినేషన్లో భారత్ చాలా మెరుగ్గా ఉందని అన్నారు. ఇక భారత్లో థర్డ్ వేవ్ త్వరలోనే ముమ్మర దశకు చేరుకుంటుందని అయితే దీనిపై కలత చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వ్యాక్సిన్కు దూరంగా ఉన్న వారు ఇప్పుడు వ్యాక్సినేషన్ తీసుకోవాలని, కొవిడ్-19 నిబంధనలను విధిగా పాటించాలని కోరారు.