IMD | న్యూఢిల్లీ, జనవరి 11: చిన్న రైతులకు మేలు చేసేలా, వాతావరణం వల్ల కలిగే నష్టాలు తగ్గించేలా ఈ నెల 15 నుంచి భారత వాతావరణ విభాగం(ఐఎమ్డీ) తన సేవలను మరింత విస్తరించనుంది. వాతావరణ సమాచారాన్ని బ్లాక్ స్థాయి నుంచి గ్రామ పంచాయతీ స్థాయికి విస్తరిస్తున్నట్టు ఐఎండీ చీఫ్ మృత్యుంజయ మహాపాత్ర గురువారం తెలిపారు. ‘పంచాయతీ రుతు సేవ’ ద్వారా ప్రతి గ్రామంలో కనీసం అయిదుగురు రైతులతో అనుసంధానమయ్యేలా ఈ సేవలను అందించనున్నారు. ఈ సేవల్లో అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ, గాలి వేగం, తీవ్ర వాతావరణ హెచ్చరికల సమాచారం అందిస్తారు.
ఇంగ్లిష్, హిందీతో పాటు 12 భారతీయ భాషల్లో ఈ సమాచారం అందుబాటులో ఉంటుంది. దేశంలో ఎవరైనా ఎక్కడైనా నిర్దిష్ట ప్రాంతానికి సంబంధించిన వాతావరణ సమాచారాన్ని తమ మొబైల్ ఫోన్లో చూసుకోవచ్చు. వాతావరణ సూచనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటే సన్నకారు రైతులు రూ.12,500 వరకు లాభం పొందవచ్చని చెప్పారు. వ్యవసాయం, ఎనర్జీ, విపత్తు నిర్వహణ, విద్యుత్తు, ఆరోగ్యం, నీళ్లు తదితర రంగాలకు వాతావరణ సేవలు విస్తరిస్తామన్నారు. వాతావరణ సూచనల ద్వారా విద్యుత్తు, ఆరోగ్యం, రవాణా రంగాల్లో నష్టాలను తగ్గించవచ్చన్నారు. ‘నిర్మాణ పనులకు, పెండ్లిండ్లకు ప్రజలు వాతావరణ సమాచారం ఉపయోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం’ అని మహాపాత్ర అన్నారు.