Karnataka Elections | బెంగళూరు, మే 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కర్ణాటకలో మళ్లీ హంగ్ ఏర్పడనున్నదా? అంటే ఎగ్జిట్ పోల్స్ అవునంటున్నాయి. తాజా శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని, త్రిముఖ పోరు నెలకొన్న రాష్ట్రంలో జనతాదళ్(సెక్యులర్) మద్దతే ఇతర పార్టీలకు కీలకం అవుతుందని వెల్లడించాయి. జీ న్యూస్-మాట్రైజ్ వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం జేడీఎస్కు అత్యధికంగా 25-33 సీట్లు వచ్చే అవకాశం ఉన్నది. టైమ్స్ నౌ, న్యూస్ నేషన్-సీజీఎస్, ఏబీపీ-సీ న్యూస్ తదితర సంస్థలు వెలువరించిన అభిప్రాయాల ప్రకారం కూడా జేడీఎస్కు 21-29 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కర్ణాటకలో రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకు 113 సీట్లు అవసరం. బీజేపీకి గరిష్ఠంగా 85-100 సీట్లు వస్తాయని చాలా సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇక కాంగ్రెస్కు గరిష్ఠంగా 94-109 సీట్లు వస్తాయని జోస్యం చెప్పాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే.. ప్రభుత్వ ఏర్పాటులో జేడీఎస్ కీలక భూమిక పోషించనున్నది. ఒకవేళ జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ మ్యాజిక్ ఫిగర్కు కొన్ని సీట్ల దూరంలో నిలిచిపోయినా లేదా జేడీఎస్కు 25 పైగా సీట్లు వచ్చినా జేడీఎస్కే ముఖ్యమంత్రి పీఠం సైతం దక్కే అవకాశం ఉన్నది.
బీజేపీకి ఎదురుగాలి
40 శాతం కమీషన్, ప్రభుత్వ అవినీతిపై ఓటర్లకు కాంట్రాక్టర్స్ అసోసియేషన్ బహిరంగ లేఖ, లోకాయుక్త దాడుల్లో బీజేపీ నాయకుల అవినీతి బహిర్గతం తదితర అంశాలు బీజేపీ విజయవకాశాలను దెబ్బ తీశాయని ఎగ్జిట్ పోల్స్ విశ్లేషించాయి.
69.71 శాతం పోలింగ్ నమోదు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 69.71 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికలు ‘చాలా వరకు’ ప్రశాంతంగా జరిగాయని పేర్కొన్నది. ఈ ఎన్నికలతో పాటు పంజాబ్లోని జలంధర్ లోక్సభ నియోజకవర్గానికి; ఒడిశా, యూపీలో ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్ జరిగిందని తెలిపింది. ఫలితాలను ఈ నెల 13న వెల్లడిస్తామని చెప్పింది. విజయనగర జిల్లా మసబినల్ గ్రామంలో ఈవీఎంలను ధ్వంసం చేసిన 23 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపింది. బీజేపీ ఈ ఎన్నికల్లో గోవా నుంచి బోగస్ ఓటర్లను తీసుకొచ్చి ఓటేయించిదని ప్రతిపక్షాలు ఆరోపించాయి.