తిరువనంతపురం: లైసెన్స్ పొందిన బార్ల నుంచి లంచంగా డబ్బు, మద్యం, ఆహారం వంటివి ఎక్సైజ్ అధికారులు వసూలు చేస్తుండటంపై ఫిర్యాదులు అందాయి. దీంతో ఉన్నతాధికారులు స్ట్రింగ్ ఆపరేషన్ చేపట్టారు. తగిన ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలో ఏడుగురు ఎక్సైజ్ అధికారులను సస్పెండ్ చేశారు. (Excise Bribery Racket Busted) కేరళలోని కొట్టాయం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చంగనస్సేరి ప్రాంతంలోని పలు బార్ల నుంచి లంచంగా డబ్బు, మద్యం, ఆహారం వంటివి ఎక్సైజ్ అధికారులు వసూలు చేస్తుండటంపై వాట్సాప్ ద్వారా ఆ శాఖకు రహస్య ఫిర్యాదులు అందాయి.
కాగా, ఎక్సైజ్ మంత్రి ఎం. లిజు ఆదేశాల మేరకు ‘ఆపరేషన్ బీజాపూర్’ కోడ్ నేమ్తో ఉన్నతాధికారులు స్ట్రింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఆగస్ట్ 28న రాత్రివేళ ఎక్సైజ్ కమిషనర్ రావు, విజిలెన్స్ అధికారులు కలిసి మారువేషంలో పలు బార్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సీసీటీవీ ఫుటేజ్లతోపాటు సిబ్బంది వాంగ్మూలాలు, ఆడియో రికార్డింగ్లు, ఇతర సాక్ష్యాలు సేకరించారు.
మరోవైపు ఎక్సైజ్ అధికారులు కొందరు వ్యక్తుల ద్వారా లంచంగా ఆ బార్ల నుంచి నిర్ణీత మొత్తంలో డబ్బు, ఖరీదైన మద్యం సీసాలు, ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటున్నట్లు వచ్చిన ఆరోపణలు నిజమని తేలాయి. ఈ నేపథ్యంలో కొట్టాయం డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ ఎస్. అశోక్ కుమార్తో సహా ఏడుగురు ఎక్సైజ్ అధికారులను సస్పెండ్ చేశారు. అశోక్ కుమార్ తన మొబైల్లోని డేటాను తొలగించినట్లు దర్యాప్తులో గుర్తించారు. పర్యవేక్షణా లోపాల ఆరోపణలపై చంగనస్సేరి ఎక్సైజ్ రేంజ్ ఇన్స్పెక్టర్ ఆదర్శ్ జిఎల్పై కూడా విచారణ ప్రారంభించారు.