కోల్కతా: వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఒక నేత తన భార్యకు ఏకే-47 గన్ను బహుమతిగా ఇచ్చాడు (AK-47 rifle Gift to wife). ఆ రైఫిల్ను ఆమె పట్టుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది వైరల్ కావడంతో ఆయనపై విమర్శలు వచ్చాయి. దీంతో ఆ పోస్ట్ను తొలగించాడు. అలాగే భార్య చేతిలో ఉన్నది బొమ్మ తుపాకీ అని పేర్కొన్నాడు. పశ్చిమ బెంగాల్లో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మాజీ నాయకుడు రియాజుల్ హక్ సోమవారం ఫేస్బుక్లో ఒక పోస్ట్ చేశాడు. మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన భార్యకు ఏకే-47 రైఫిల్ను బహుమతిగా ఇచ్చినట్లు అందులో పేర్కొన్నాడు. భార్య గన్ పట్టుకున్న ఫొటోను షేర్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, రియాజుల్ ఫేస్బుక్ పోస్ట్పై విమర్శలు వెల్లువెత్తాయి. తాలిబన్ రూల్ను ఆయన ప్రతిబింబిస్తున్నారని బీజేపీ, సీపీఎం విమర్శించాయి. ఈ ఫొటో పోస్ట్ చేయడం వెనుక ఆయన ఉద్దేశం ఏమిటని ప్రశ్నించాయి. దీనిపై దర్యాప్తు జరుపాలని డిమాండ్ చేశాయి.
మరోవైపు ఈ విమర్శల నేపథ్యంలో ఫేస్బుక్ పోస్ట్ను రియాజుల్ తొలగించారు. తన భార్య పట్టుకున్నది బొమ్మ తుపాకీ అని తెలిపారు. ఇందులో ఎలాంటి చట్టవిరుద్ధం లేదని పేర్కొన్నారు. నకిలీ గన్ విషయంలో తప్పుడు ఆరోపణలు రావడంతో ఆ పోస్ట్ను డిలీట్ చేసినట్లు వివరించారు.
కాగా, డిప్యూటీ స్పీకర్, రాంపూర్హాట్ ఎమ్మెల్యే ఆశిష్ బందోపాధ్యాయకు సన్నిహితుడైన రియాజుల్, ఆ బ్లాక్ టీఎంసీ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే రెండు నెలల కిందట ఆ పదవికి, పార్టీకి ఆయన రాజీనామా చేశారు.