భోపాల్: సాయుధ దళాల్లో నాలుగేళ్ల కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ పథకం అగ్నిపథ్పై దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఆర్మీలో చేరాలని ఆకాంక్షించే అభ్యర్థులు ఓ వైపు అగ్నిపథ్ను వ్యతిరేకిస్తూ ఆందోళనలు తీవ్రం చేస్తున్నారు. మరోవైపు మాజీ సైనికులు కూడా అగ్నిపథ్ నిరసనల్లో పాల్గొంటున్నారు. తమకు ఇచ్చిన హామీలనే అమలు చేయడం లేదని ఇక అగ్నివీరుల భవిష్యత్తుకు ఏం భరోసా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.
తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్కు చెందిన కొందరు మాజీ సైనికులు ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. 1999 నుంచి తమకు వర్తింపచేసిన ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు. అలాగే పోలీస్ రిక్రూట్మెంట్లో భౌతిక ప్రమాణ పరీక్షలకు సంబంధించి మాజీ సైనికులకు సడలింపు ఇవ్వడం లేదని విమర్శించారు.
సుమారు 30 వేల మంది అభ్యర్థులు 6,000 కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసినట్లు మాజీ సైనికులు తెలిపారు. అయితే నిబంధనలు, రిజర్వేషన్ ప్రకారం 600 పోస్టులు మాజీ సైనికులకు కేటాయించాల్సి ఉండగా కేవలం ఆరుగురు మాత్రమే ఎంపికయ్యారని వాపోయారు. ఈ నేపథ్యంలో తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ అజిత్ సింగ్తోపాటు 32 మంది మాజీ సైనికులు హైకోర్టును ఆశ్రయించారు.
కాగా, మాజీ సైనికుల పిటిషన్పై విచారణ జరిపిన మధ్యప్రదేశ్ హైకోర్టు, ఆ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎంపీపీఎస్స్సీ)కి నోటీసులు జారీ చేసింది. మాజీ సైనికులకు ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించింది. దీనిపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.