Amarinder Singh | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా పంజాబ్ మాజీ సీఎం అమరిందర్ సింగ్ను నిలిపే అవకాశం ఉందని సమాచారం. గతేడాది పంజాబ్ సీఎంగా తప్పించిన తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడారు కెప్టెన్ అమరిందర్ సింగ్. తనకు అవమానం జరిగిందని పేర్కొంటూ సొంతంగా పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. బీజేపీ, సుఖ్దేవ్ సింగ్ ధిండ్సా సారధ్యంలోని శిరోమణి అకాలీదళ్ (సంయుక్)లతో కలిసి ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ, ఆయనతోపాటు ఆయన పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది.
ఉపరాష్ట్రపతి ఎన్నిక వచ్చే నెల ఆరో తేదీన జరుగుతుంది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీ కాలం వచ్చేనెల 10తో ముగుస్తుంది. పార్లమెంట్ ఉభయసభల సభ్యులు కలిసి ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఎన్డీఏ తరఫున ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థులుగా అమరిందర్ సింగ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ పేర్లను పరిశీలిస్తున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిని బీజేపీ నాయకత్వం.. ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు ఖరారు చేస్తాయని ఆ వర్గాల కథనం.
అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న కెప్టెన్ అమరిందర్ సింగ్.. లండన్లోని దవాఖానలో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. లండన్ నుంచి స్వదేశానికి రాగానే బీజేపీలో తన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేస్తారని బీజేపీ పంజాబ్ సీనియర్ నేత హర్జిత్ సింగ్ గ్రేవాల్ తెలిపారు. స్వదేశానికి రాగానే బీజేపీలో తన పార్టీ విలీనంపై ప్రకటన చేస్తారని గ్రేవాల్ తెలిపారు. ఈ నెల ఐదో తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అవుతుంది. ఈ నెల 19 నామినేషన్లు దాఖలు చేయడానికి తుది గడువు.