ముంబై: బాలీవుడ్ సూపర్స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) శుక్రవారం క్లీన్చిట్ ఇచ్చింది. ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ను గత ఏడాది అక్టోబర్ 3న ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. 26 రోజుల పాటు కస్టడీ అనంతరం అక్టోబర్ 28న బాంబే హైకోర్టు ఆర్యన్కు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ఆర్యన్ ఖాన్తోపాటు మరో ఐదుగురిపై సరైన ఆధారాలు లేకపోవడంతో ఎన్సీబీ వారికి క్లీన్ చిట్ ఇచ్చింది.
మరోవైపు క్రూయిజ్ డ్రగ్ పార్టీ కేసులో ఆర్యన్ ఖాన్తో పాటు 17 మందిని అరెస్ట్ చేసిన ఎన్సీబీ మాజీ అధికారి సమీర్ వాంఖడే దీనిపై సరిగా స్పందించలేదు. ‘సారీ… నో కామెంట్’ అని వ్యాఖ్యానించారు. ‘క్షమించండి, నేనేమీ వ్యాఖ్యానించలేను. నేను ఎన్సీబీలో లేను. దీని గురించి ఎన్సీబీ అధికారులతో మాట్లాడండి’ అని మీడియాతో అన్నారు.
కాగా, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) కేడర్కు చెందిన సమీర్ వాంఖడే 2020 సెప్టెంబర్లో డిప్యుటేషన్పై ఎన్సీబీకి వెళ్లారు. ఎన్సీబీ ముంబై జోనల్ డైరెక్టర్గా ఉన్న ఆయన క్రూయిజ్ డ్రగ్స్ కేసు, ఆర్యన్ ఖాన్ అరెస్ట్లో కీలకంగా వ్యవహరించారు. అనంతరం ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. అయితే గత ఏడాది డిసెంబర్ 31తో ఎన్సీబీలో ఆయన డిప్యుటేషన్ కాలం ముగిసింది. దీంతో సమీర్ వాంఖడేను ఈ ఏడాది జనవరిలో మాతృ కేడర్ అయిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్కు తిరిగి పంపారు.